విజ్ఞాన్ రత్తయ్యకు షాక్.. అభ్యర్థిని మార్చిన జగన్
ఏ సీటు ఎవరికి ఇవ్వాలనే విషయంపై కూడా కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే పలువురి పేర్లను కూడా ప్రకటించారు. ఇందులో భాగంగానే జగన్ ఓ యువనేతకు షాక్ ఇచ్చారు.
2019 ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని వైసీపీ అధినేత జగన్ మాష్టర్ ప్లాన్ వేస్తున్నారు. దీనిలో భాగంగానే.. ఏ సీటు ఎవరికి ఇవ్వాలనే విషయంపై కూడా కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే పలువురి పేర్లను కూడా ప్రకటించారు. ఇందులో భాగంగానే జగన్ ఓ యువనేతకు షాక్ ఇచ్చారు.
ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. గుంటూరు ఎంపీ స్థానానికి టీడీపీ నుంచి గల్లా జయదేవ్ పోటీ చేయనున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆయనకు పోటీగా వైసీపీ నుంచి విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య కుమారుడు శ్రీకృష్ణదేవరాయలు పేరును నాలుగేళ్ళ క్రితమే ఖరారు చేశారు. ఈ లోక్సభ స్థానం కోఆర్డినే టర్గా వ్యవహరిస్తూ కృష్ణదేవరాయలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలో తండ్రి రత్తయ్యతో పాటు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కనప్పటికీ, ఆ తరువాత పార్టీ పరాజయం పాలైనప్పటికీ వైసీపీలోనే కొనసాగుతూ పార్టీ కోసం తన వంతు కృషి చేస్తూ వస్తున్నారు.
కాగా.. సడెన్ గా శ్రీకృష్ణ దేవరాయులు కి జగన్ షాక్ ఇచ్చారు. గుంటూరు లోక్సభ స్థానం నుంచి కాపు సామాజిక వర్గం అభ్యర్ధిని బరిలోకి దించాలని భావించి మాజీ కేంద్ర మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు, చిల్లీస్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కిలారి రోశయ్య పేరును తెరపైకి తెచ్చారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన రోశయ్య తదనంతరం వైసీపీలో చేరారు. తిరిగి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న రోశయ్యకు జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. భారీ మొత్తాన్ని భరించగలిగితే ఎంపీ సీటు ఇస్తానంటూ ఆఫర్ ఇవ్వగా ఆయన వెంటనే అంగీకరించినట్లు విశ్వసనీయ సమాచారం.
రోశయ్య పోటీకి సిద్ధం అనగానే కృష్ణ దేవరాయులును పిలిచి సామాజిక సమీకరణల నేపథ్యంలో నీ సీటు రోశయ్యకు ఇస్తున్నట్లు చెప్పి, నువ్వు నరసరావుపేట నుంచి పోటీ చేయాలని ఆదేశించారు. అయితే ఇప్పటికే గుంటూరు అభ్యర్ధిగా ప్రచారం చేసుకొని బూత్స్థాయి వరకు కార్యకర్తలతో మమేకమైన శ్రీకృష్ణదేవరాయలు ఈ హఠాత్ పరిణామంతో దిగ్బ్రాంతికి గురయ్యారు.