టీడీపీ- జనసేన పొత్తు : బీసీలనే నమ్ముకుంటోన్న జగన్.. ఆర్ కృష్ణయ్యతో పవన్కు చెక్ సాధ్యమేనా ..?
2024 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జగన్ మోహన్ రెడ్డి సీరియస్గా దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. టీడీపీ- జనసేన పొత్తు ఖచ్చితంగా జరుగుతుందన్న ప్రచారం నేపథ్యంలో ఆయన జాగ్రత్త పడుతున్నారు. దీనిలో భాగంగా బీసీలను జగన్ ఫోకస్ చేసినట్లుగా కనిపిస్తోంది.
ఏపీలో బీసీలకు మరోసారి పెద్దపీట వేశారు సీఎం జగన్ (ys jagan) . ఇప్పటికే రాజ్యసభలో (ysrcp rajya sabha candidates) వైసీపీ నుంచి ఇద్దరు బీసీ ఎంపీలు వుండగా.. తాజాగా మరో ఇద్దరిని ఎంపిక చేశారు. ఆర్ కృష్ణయ్య ( r krishnaiah), బీద మస్తాన్ రావులను (beeda mastan rao) రాజ్యసభ అభ్యర్ధులుగా ఖరారు చేశారు జగన్. దీంతో రాజ్యసభలో వైసీపీ బీసీ సభ్యుల సంఖ్య నాలుగుకి చేరింది. ఇప్పటికే కీలక పదవుల్లో బీసీలను నియమించారు సీఎం జగన్. అసెంబ్లీ స్పీకర్, ఏడు మున్సిపల్ కార్పోరేషన్ మేయర్లు, 37 మున్సిపల్ ఛైర్మన్లు, ఆరు జడ్పీ ఛైర్మన్లు, 76 మార్కెట్ కమిటీ ఛైర్మన్లు, 53 ప్రభుత్వ కార్పోరేషన్ ఛైర్మన్లు, బీసీల కోసమే 56 ప్రత్యేక కార్పోరేషన్లను జగన్ ఏర్పాటు చేశారు.
బీసీల తరపున సీఎం జగన్కు ధన్యవాదాలు చెప్పారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. గతంలో ఎన్నడూ ఇలాంటి అవకాశాలు బీసీలకు దక్కలేదన్నారు. జగన్ బీసీలకు 44 శాతం రిజర్వేషన్ కల్పించారని ఆర్ కృష్ణయ్య ప్రశంసించారు. బీసీల పోరాటం అనేది తెలంగాణకు సంబంధించినది కాదని.. దేశవ్యాప్తంగా బీసీల కోసం పోరాడుతున్నానని కృష్ణయ్య తెలిపారు. ఈ పోరాటాన్ని గుర్తించి జగన్ తనకు రాజ్యసభ అవకాశం కల్పించారని కృష్ణయ్య వెల్లడించారు.
బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్యను రాజ్యసభకు పంపడం ద్వారా బీసీల పార్టీగా ముద్రపడిన టీడీపీని (tdp) జగన్ మరోసారి కోలుకోలేని దెబ్బ కొట్టారని విశ్లేషకులు అంటున్నారు. బీసీ అంటే కృష్ణయ్య.. కృష్ణయ్య అంటే బీసీ అన్నట్లుగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. 1994లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీ సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసి నాటి నుంచి పరాటం చేస్తున్నారు. ఇన్నేళ్లలో ఆయనను ఏ రాజకీయ పార్టీ గుర్తించలేదు. ఎన్నికలప్పుడు మాత్రం వాడుకుని వదిలేసింది.
కాకపోతే.. 2014లో ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఆయన విజయం సాధించారు. అంతేకాదు నాడు తెలంగాణ సీఎం అభ్యర్ధిగా ఆర్ కృష్ణయ్యను టీడీపీ తెరపైకి తెచ్చింది. అనంతరకాలంలో ఆయన టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. 2018 ఎన్నికల్లో మిర్యాలగూడ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. నాటి నుంచి రాజకీయాలకు దూరంగా వుంటున్న ఆయన వైసీపీకి దగ్గరయ్యారు. 2019 ఎన్నికల్లో జగన్కు మద్ధతు ప్రకటించిన కృష్ణయ్య.. ఆయనను గెలిపించాలని పిలుపునిచ్చారు .
ఏపీలో మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో టీడీపీ, జనసేన పొత్తు (tdp janasena alliance) కుదుర్చుకుంటాయనే ప్రచారం జరుగుతోంది. పవన్ (pawan kalyan) ప్రభావంతో మెజార్టీ కాపులు టీడీపీ వైపు పోయినా, బీసీలను పూర్తిస్థాయిలో తన వైపు నిలుపుకోవచ్చనే ఎత్తుగడలో భాగంగానే ఆర్.కృష్ణయ్య, బీద మస్తాన్రావులకు జగన్ రాజ్యసభ సీట్లు ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా కృష్ణయ్య విషయంలో జగన్ స్కెచ్ రానున్న రోజుల్లో చెమటలు పట్టించడం ఖాయమనే వాదన వినిపిస్తోంది.