వైసీసీ నేత దేవినేని అవినాష్ ఇంట్లో ఐటీ సోదాలు..
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. వైసీపీ నేత దేవినేని అవినాష్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. వైసీపీ నేత దేవినేని అవినాష్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి అవినాష్ ఇంట్లో అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఐదు బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నారు. అవినాష్ ఇంటితో పాటు మరికొన్ని చోట్ల కూడా ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్లో దేవినేని అవినాష్కు చెందిన భూమి క్రయవిక్రయాలకు సంబంధించిన వ్యవహారంలో ఐటీ అధికారులు ఈ సోదాలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. అయితే దీనిపై పూర్తి స్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది.
మరోవైపు హైదరాబాద్లోని పలుచోట్ల కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచే వంశీ రామ్ బిల్డర్ సుబ్బారెడ్డి కార్యాలయం, ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. సుబ్బారెడ్డి బావమరిది జనార్ధన్రెడ్డి ఇంట్లో సోదాలు చేస్తున్నారు. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఐటీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. సోదాల్లో భాగంగా ఐటీ అధికారులు పలు డాక్యూమెంట్స్ పరిశీలిస్తున్నారు. మొత్తం 15 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది.
అయితే హైదరాబాద్లో దేవినేని అవినాష్ భూమికి సంబంధించి.. వంశీ బిల్డర్స్తో ఆర్థిక లావాదేవీలు జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే రెండు చోట్ల ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.