ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా డీఎస్పీల బదిలీ చేపట్టింది. 50 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా డీఎస్పీల బదిలీ చేపట్టింది. 50 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ సర్కార్ ఇటీవలే రాష్ట్రంలో భారీ ఎత్తున డీఎస్పీల బదిలీ చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో కొందరిని మరోసారి బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ బదిలీల్లో భాగంగా.. ఒంగోలు డీఎస్పీగా నారాయణస్వామిరెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఇటీవల ఒంగోలు డీఎస్పీగా నియమించిన అశోక్ వర్దన్ను దర్శికి బదిలీ చేసింది. దీంతో ఒంగోలు డీఎస్పీగా చార్జ్ తీసుకున్న రెండు రోజుల్లోనే అశోక్ వర్దన్ను అక్కడి నుంచి బదిలీ చేశారు.
అయితే గతకొంతకాలంగా వైసీపీ అధిష్టానంతో అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. ఒంగోలు డీఎస్పీగా అశోక్ వర్దన్ను నియమించడంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆయనను బుజ్జగించే ప్రయత్నాల్లో అశోక్ వర్దన్ను అక్కడి నుంచి బదిలీ చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో బాలినేని శ్రీనివాస్ రెడ్డి తన పంతం నెగ్గించుకున్నారనే మాట వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే.. కనిగిరి డీఎస్పీగా రామరాజును, అమలాపురం ఎస్డీపీఓగా అంబికా ప్రసాద్ను, రాజమహేంద్రవరం ఈస్ట్ డీఎస్పీగా కిషోర్ కుమార్లను ప్రభుత్వం బదిలీ చేసింది. వెయిటింగ్లో 24 మంది డీఎస్పీలకు వేర్వేరు చోట్ల పోస్టింలు ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
