వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తనపై దాడి చేశారని ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సూర్య కిరణ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన రాజమహేంద్రవరం త్రీ టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తనపై దాడి చేశారని ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సూర్య కిరణ్ ఆరోపించారు. సూర్య కిరణ్.. పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ రెండో డివిజన్‌ ఏఈఈగా పనిచేస్తున్నారు. అయితే ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తనను మూడు సార్లు చెంపదెబ్బ కొట్టారని రాజమహేంద్రవరం త్రీ టౌన్ పోలీసు స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి సూర్య కిరణ్ మాట్లాడారు. పోలవరం ప్రధాన ఎడమ కాలువకు సంబంధించిన పుష్కర కాలువ రంగంపేట పరిధిలో ఉంది.

2020లో పోలవరం ఎడమ కాలువ పరిధిలో రైతులు పుష్కర కాలువ పూడికతీత పనులు నిర్వహించారు. వీటికి నిధులు మంజూరయ్యాక బిల్లులు చెల్లించాలని రైతులు అప్పట్లోనే అధికారులకు చెప్పారు. కానీ ఇప్పటికీ ఆ బిల్లులు రాకపోవడంతో ఈ విషయాన్ని ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను ఆశ్రయించారు. బిల్లులు చెల్లించాలని ఏడాదిగా ఎమ్మెల్యే అధికారులను అడుగుతున్నారు.

ఈ క్రమంలోనే బుధవారం జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశంలో ఈ విషయం గురించి ఎమ్మెల్యే.. కార్యనిర్వాహక ఇంజినీరు సూర్యకిరణ్‌ను ప్రశ్నించారు. వివరణ ఇస్తుండగానే.. ఆయన ఆగ్రహంతో తనను మూడుసార్లు చెంపపై కొట్టారని సూర్య కిరణ్ తెలిపారు. జలవనరుల శాఖ ఉన్నతాధికారుల సమక్షంలోనే ఇదంతా జరుగుతున్నా.. వారు కనీసం ఆయన్ను ఆపేందుకు ప్రయత్నించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

Scroll to load tweet…

ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దౌర్జన్యం చేసి తనను మూడు సార్లు చెంపపై కొట్టారని.. ఆయనపై కేసు నమోదు చేయాలని సూర్యకిరణ్‌ లిఖితపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన వెంట ఏఈల అసోసియేషన్‌ సభ్యులు కూడా పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అయితే ఇందుకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ మధుబాబు చెప్పారు. ఇక, సూర్య కిరణ్ మీడియాతో మాట్లాడుతున్న వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేసిన టీడీపీ.. ‘‘ఆగని అరాచక పర్వం! ప్రభుత్వ ఉద్యోగులపై పెరిగిన దాడులు!!’’ అని విమర్శించింది.