కర్నూలు విమానాశ్రయం నుంచి రాకపోకలకు డీజీసీఏ నుంచి అనుమతి లభించడంతో పలు విమానాయాన సంస్థలు ఆపరేషన్స్ మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో బెంగళూరు, విశాఖ, చెన్నై నగరాలకు విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు ఇండిగో సంస్థ శుక్రవారం ప్రకటించింది. 

కర్నూలు విమానాశ్రయం నుంచి రాకపోకలకు డీజీసీఏ నుంచి అనుమతి లభించడంతో పలు విమానాయాన సంస్థలు ఆపరేషన్స్ మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో బెంగళూరు, విశాఖ, చెన్నై నగరాలకు విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు ఇండిగో సంస్థ శుక్రవారం ప్రకటించింది.

రీజినల్‌ కనెక్టివిటీ పథకం (ఉడాన్‌) లో భాగంగా మార్చి 28 నుంచి ఈ సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది. దక్షిణ భారతదేశంలో రీజినల్‌ కనెక్టివిటీని పెంచేందుకు ఈ సర్వీసులను ప్రారంభిస్తున్నామని ఇండిగో తెలిపింది.

హైదరాబాద్‌- బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌కు అనుమతి లభించిన నేపథ్యంలో రీజినల్ కనెక్టివిటీ అవసరమని తాము భావిస్తున్నామని ఆ సంస్థ అధికారి ఒకరు తెలిపారు.  

కొత్తగా ప్రారంభించే బెంగళూరు - కర్నూలు, విశాఖపట్నం - కర్నూలు, చెన్నై - కర్నూలు మార్గాల్లో వారానికి నాలుగు సర్వీసులుంటాయని ఇండిగో సదరు ప్రకటనలో వెల్లడించింది.

ప్రాంతీయ విమానాశ్రయాల అభివృద్ధి, రీజినల్‌ కనెక్టివిటీ కోసం ఉడాన్‌ పథకాన్ని కేంద్రం ప్రారంభించిన సంగతి తెలిసిందే. సామాన్యుడికి కూడా విమాన ప్రయాణం సరసమైన ధరల్లో అందుబాటులో ఉంచేందుకు కేంద్రం 2017లో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.