తిరుపతి రైల్వే స్టేషన్ రూపు రేఖలు మారిపోనున్నాయి. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 14 రైల్వేస్టేషన్లను 5 వేల కోట్లతో అభివృద్ధి చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో తిరుపతి కూడా వుంది. దీనికి సంబంధించి కాంట్రాక్ట్ ఖరారైంది.
మారుతున్న కాలంతో పాటు ప్రయాణీకుల రద్దీ, ఇతర అవసరాలను దృష్టిలో పెట్టుకుని దేశవ్యాప్తంగా వున్న పలు రైల్వేస్టేషన్లను కేంద్ర ప్రభుత్వం ఆధునీకరించాలని భావించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కొన్ని రైల్వే స్టేషన్లను ఎంపిక చేసింది. ఇందులో భాగంగా ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిలోని రైల్వేస్టేషన్ (tirupati railway station) అభివృద్ధికి సిద్దమవుతోంది. దీనికి సంబంధించిన పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. అభివృద్ధి చేశాక తిరుపతి రైల్వేస్టేషన్ ఎలా ఉండబోతోందన్న దానిపై రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ (railway minister ashwini vaishnaw) ఇవాళ కొన్ని ఫొటోల్ని ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తొలి దశలో దేశంలోని ఎంపిక చేసిన 14 రైల్వేస్టేషన్లను 5 వేల కోట్లతో అభివృద్ధి చేయాలని భావిస్తున్న కేంద్రం ఈ మేరకు టెండర్లను కూడా ఖరారు చేసింది. ఇందులో ఏపీలోని తిరుపతి రైల్వేస్టేషన్ కూడా ఉంది. పీపీపీ విధానంలో అయితే పనులు ఆలస్యం అవుతాయని భావిస్తున్న కేంద్రం.. ఈపీసీ విధానంలో పనుల్ని అప్పగించింది. ఈ మేరకు కాంట్రాక్టుల అప్పగింత పూర్తయినట్లు అశ్వినీ వైష్ణవ్ ఇవాళ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన వరల్డ్ క్లాస్ తిరుపతి రైల్వేస్టేషన్ అంటూ పేర్కొన్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి (lord venkateswara swamy) పాదాల చెంత ఉన్న తిరుపతిలోని రైల్వే స్టేషన్ నిత్యం రద్దీగానే ఉంటుంది. దేశ, విదేశాల నుంచి వెంకన్న దర్శనం కోసం వచ్చే భక్తులతో నిత్యం కిటకిటలాడుతూ ఉంటుంది. అయితే ఆ రద్దీకి తగ్గట్టుగా రైల్వే స్టేషన్లో ఇప్పటిదాకా పెద్దగా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. 20 ఏళ్ల క్రితం తిరుపతి రైల్వేస్టేషన్ ఎలా ఉండేదో.. ఇప్పుడు కూడా దాదాపుగా అలాగే ఉంది. ఈ క్రమంలోనే వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్గా తిరుపతి రైల్వే స్టేషన్ను రూపు దిద్దాలని కేంద్రం నిర్ణయించింది.
