ఓటర్లకు గాలం.. బిర్యానీ ప్యాకెట్లలో బంగారం
ఎవరికీ అనుమానం రాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి కొందరిని కిరాయికి పిలిపించాడు. మంగళవారం బిర్యాని పొట్లాల్లో ముక్కుపుడకలు ఉంచి ఓటర్లకు పంపిణీ చేయించాడు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా... ఈ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభానికి గురిచేసేందుకు అభ్యర్థులు చేయని ప్రయత్నమంటూ లేదు. ఈ క్రమంలో ఓ అభ్యర్థికి బిర్యానీ ప్యాకెట్లలో బంగారం ముక్కు పుడకలు దాచి పెట్టి పంచిపెట్టడం గమనార్హం. ఈ సంఘటన నంద్యాల పట్టణంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నంద్యాల పట్టణంలోని 12వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా ఖండే శ్యాంసుందర్లాల్ పోటీ చేస్తున్నాడు. ఓటర్లను డబ్బు, బంగారంతో మభ్యపెట్టాలని చూశాడు. ఎవరికీ అనుమానం రాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి కొందరిని కిరాయికి పిలిపించాడు. మంగళవారం బిర్యాని పొట్లాల్లో ముక్కుపుడకలు ఉంచి ఓటర్లకు పంపిణీ చేయించాడు.
సమాచారం అందుకున్న పోలీసులు పంపిణీ చేస్తున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాఘవేంద్రస్వామి, రవికిరణ్, మోహన్ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నాలుగు బైకులు,రూ.55 వేల నగదు, 23 బంగారు ముక్కుపుడకలు, బిర్యానీ పొట్లాలను స్వాధీనం చేసుకున్నారు. అభ్యర్థి శ్యామ్సుందర్లాల్తో పాటు మరో ముగ్గురిపై ఎన్నికల నియామావళి అతిక్రమణ కింద కేసు నమోదు చేశారు.