ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునే చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి రెవెన్య అందించే శాఖలపై ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించారు.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునే చర్యలను ముఖ్యమంత్రి జగన్, వైసిపి ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రానికి రెవన్యూ అందించే వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్స్, రవాణా, భూగర్భగనులు, అటవీ తదితర శాఖలపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి అదికారులకు పలు కీలక ఆదేశాలిచ్చారు. అన్ని శాఖల్లో ప్రొఫెషనలిజం పెంచుకుని ఆదాయం పెంచుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.
వాణిజ్య పన్నుల శాఖ పునర్నిర్మాణానికి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. శాఖలో ప్రతి ఒక్కరి పాత్ర, బాధ్యతలపై స్పష్టత వుండేలా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం తెలిపారు. కొత్తగా డాటా అనలిటిక్స్ విభాగంతో పాటు లీగల్ సెల్ ఏర్పాటు కు నిర్ణయం తీసుకున్నారు. బకాయిల వసూలుకు ఓటీఎస్ సదుపాయం కల్పించాలని నిర్ణయించారు. జూన్కల్లా వాణిజ్య పన్నుల శాఖలో ఈ విభాగాల ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు.
రిజిస్ట్రేషన్ శాఖపై సమీక్షలో ఓటీఎస్ పథకం కింద లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్లను వేగంగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు. టిడ్కోకు సంబంధించి రిజిస్ట్రేషన్లను పూర్తిచేయాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోకి రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చాక సిబ్బందికి, ప్రజలకు అవగాహన కల్పించాలని... ఎలాంటి సేవలు పొందవచ్చు అన్న అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. కేవలం ఆస్తుల రిజిస్ట్రేషనే కాకుండా... రిజిస్ట్రేషన్ పరంగా అందించే ఇతర సేవలపైన కూడా పూర్తిస్థాయి సమాచారం, అవగాహన కల్పించాలన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియతో న్యాయపరంగా ఎలాంటి హక్కులు వస్తాయి... ఎలాంటి భద్రత వస్తుందన్న దానిపై కూడా అవగాహన కల్పించాలని సీఎం జగన్ ఆదేశించారు.
అక్టోబరు 2న తొలివిడతగా గ్రామాల్లో శాశ్వత భూ హక్కు, భూ రక్ష పత్రాలతో పాటు సంబంధిత సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే 650 గ్రామాల్లో జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పత్రాలతో పాటు రిజిస్ట్రేషన్ సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని... ఈ గ్రామాల సంఖ్యను పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. 14వేలమంది గ్రామ, వార్డు సెక్రటరీలకు రిజిస్ట్రేషన్పై శిక్షణ కూడా అందిస్తున్నామని అధికారులు అన్నారు.
అటవీ శాఖపై సమీక్షలో వెదురు పెంపకాన్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని ఈ శాఖ అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. అలాగే ఎక్సైజ్ శాఖపై సమీక్షలో అక్రమ మద్యం తయారీ, అక్రమ మద్యం రవాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు.
భూగర్భ గనుల శాఖ అధికారులతో సమావేశంలో క్వారీల పెంపుకు నిర్ణయం తీసుకున్నారు. మైనర్ మినరల్కు సంబంధించి కార్యకలాపాలు నిర్వహించని క్వారీలు 2,700కుపైగా ఉన్నాయని సీఎంకు తెలియజేసి... వీటిలో కార్యకలాపాలు తిరిగి ప్రారంభించాల్సిన అవసరం ఉందని అధికారులు వివరించారు. దీనిపై దృష్టిపెట్టాలని సీఎం సూచించారు. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయాలు పెరుగుతాయన్నారు.
ఏపీఎండీసీ నిర్వహిస్తున్న సులియారీ బొగ్గు గనుల నుంచి ఉత్పత్తి ప్రారంభమైందన్న అధికారులు సీఎంకు తెలిపారు. జెన్కో సహా రాష్ట్రంలోని పలు పరిశ్రమలకు దీని నుంచి బొగ్గు సరఫరా అయ్యేలా చూసుకోవాలని సీఎం సూచించారు. దీనివల్ల జెన్కో ఆధ్వర్యంలోని విద్యుత్ ప్రాజెక్టులకు మేలు జరుగుతుందన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బొగ్గు ధరలు మండిపోతున్న దృష్ట్యా ఈ బొగ్గును మన అవసరాలకు వినియోగించుకునేలా చూడాలన్నారు.దీనిపై కార్యాచరణ రూపొందించి తనకు నివేదించాలన్న సీఎం ఆదేశించారు. తదుపరి కూడా బొగ్గుగనుల వేలం ప్రక్రియలో పాల్గొనడంపై దృష్టిపెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు.
