IAS Transfers in AP: విజయవాడ కమీషనర్ గా రంజిత్, ఎవరెవరు బదిలీ అయ్యారంటే...
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పాలనాపరంగా కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు ఐఎఎస్ అధికారులను బదిలీచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి: ఓవైపు పీఆర్సీ (ap prc issue) జీవోలపై ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో పాలనా పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా వైసిపి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వివిధ శాఖల్లో పనిచేస్తున్న దాదాపు తొమ్మిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ నూతన బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు జగన్ సర్కార్ ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గా ప్రసన్న వెంకటేష్ ను నియమించింది ప్రభుత్వం. ఇక మైనార్టీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా కె.సునీత, సాంఘీక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా గంధం చంద్రుడు నియమితులయ్యారు.
ఏపీ కార్మిక శాఖ ప్రత్యేక కమిషనర్ గా కార్తికేయ మిశ్రాను నియమించింది ప్రభుత్వం. కాపు కార్పొరేషన్ ఎండీగా రేఖారాణి, సాంఘీక సంక్షేమ శాఖ, రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ కార్యదర్శిగా ఆర్ పవన్ మూర్తి నియమితులయ్యారు.
ప్రస్తుత విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్థానంలో కొత్తగా రంజిత్ బాష నియమితులయ్యారు. ఎంఎస్ ఎం ఈ కార్పొరేషన్ సీఈవో గా ఎన్వీ రమణరెడ్డి, ఏపీ భవన్ స్పెషల్ ఆఫీసర్(అదనపు బాధ్యతలు)గా హిమాన్షు శుక్లాను ప్రభుత్వం నియమించింది.