భర్త కన్నా ఎక్కువ జీతం: లేడీ టెక్కి అనుమానాస్పద మృతి
తన కంటే ఎక్కువ జీతం సంపాదిస్తోందనే అసూయతో పాటు తక్కువ కట్నం తీసుకొచ్చిందని కారణంగా భార్యను వేధింపులకు గురి చేయడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.
నిడదవోలు: తన కంటే ఎక్కువ జీతం సంపాదిస్తోందనే అసూయతో పాటు తక్కువ కట్నం తీసుకొచ్చిందని కారణంగా భార్యను వేధింపులకు గురి చేయడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. అయితే తమ కూతురిని అత్తింటి వారే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు పట్టణానికి చెందిన రావి ధనుంజయరావు, ధనలక్ష్మిల కుమార్తె జయమాధవి (28)కి గత ఏడాది మార్చి మూడో తేదీన విజయవాడకు చెందిన గాదిరెడ్డి వెంకట సుబ్రహ్మణ్యంతో ఘనంగా వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో అల్లుడికి రూ. 30 లక్షల కట్నం, 30 తులాల బంగారం, రెండు లక్షలను ఆడపడుచు కట్నంగా అరకేజీ వెండి ఇచ్చినట్టుగా బాధిత కుటుంబం చెబుతోంది.
సుబ్రమణ్యం, జయమాధవిలు బెంగుళూరులోని వేర్వేరు సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ఇద్దరి వేతనాలు ఏటా పాతిక లక్షల వరకు ఉంటుంది. తొలుత వీరిద్దరూ మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి. ఆ తర్వాత ఎందుకో సుబ్రమణ్యం వైఖరిలో మార్పు వచ్చినట్టుగా జయ మాధవి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
సుబ్రమణ్యం కంటే జయమాధవికే ఎక్కువ జీతం వస్తోంది. అంతేకాదు అదే సమయంలో తక్కువ కట్నాన్ని ఆమె తీసుకొచ్చిందని జయ మాధవిని సుబ్రమణ్యం కుటుంబసభ్యులు వేధింపులకు గురిచేసేవారని బాధిత కుటుంబం ఆరోపణలు చేస్తోంది.
ఈ లోపుగా జయ మాధవి ఆమె గర్భవతి కావడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. ఈ విషయం తెలిసి సంతోషించాల్సిన భర్త అప్పటి నుంచి మరింతగా వేధించసాగాడు. చివరకు వీటిని తట్టుకోలేక జయమాధవి తన తల్లిదండ్రులకు చెప్పడం తో వారు ఆదివారం వెళ్లి తమ కుమార్తెను తీసుకుని వద్దా మని నిర్ణయించుకున్నారు.
శనివారం అర్ధరాత్రి సుబ్ర హ్మణ్యం వీరికి ఫోన్ చేసి మీ కుమార్తె పరిస్థితి బాగాలేదు.. ఆసుపత్రిలో చేర్పించాం.. వెంటనే రావాలని ఫోన్ చేయడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు.. అయితే మరో గంటకు మీ కుమార్తె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్పడంతో కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.తమ కుమార్తెను చిత్రహింస లకు గురి చేసి భర్త, అతని తల్లి, సోదరి హత్య చేసినట్టు బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని నిడదవోలు తీసుకొస్తున్నారు.