కర్నూలు జిల్లా గంగులపాడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి గెలిచినట్లుగా అధికారులు ప్రకటించడాన్ని టీడీపీ నేతలు తప్పుబట్టారు. అధికారులతో గొడవకు దిగారు.

కర్నూలు జిల్లా గంగులపాడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సర్పంచ్ ఎన్నికల్లో ఐదవ వార్డ్ వైసీపీ అభ్యర్ధి ముంతాజ్ ఒక్క ఓటుతో గెలిచినట్లు అధికారులు ధ్రువీకరించారు. అయితే మరో ఓటు వున్నప్పటికీ అది చెల్లుబాటు కానిదిగా ప్రకటించారు. దీంతో ఎన్నికల అధికారుల తీరును తప్పుబడుతూ టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. రీకౌంటింగ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. అధికారులతో గొడవకు దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. 

మరోవైపు.. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం ఎర్రమాడు పంచాయతీ ఎన్నికల్లో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. రెండు సార్లు కౌంటింగ్ నిర్వహించడం ఫలితం తారుమారు కావడంతో టీడీపీ ఆందోళన చేపట్టింది. మొదట ప్రకటించిన ఫలితాల్లో ఒక ఓటు తేడాతో తమ అభ్యర్ధి గెలిచాడని టీడీపీ నేతలు చెప్పారు. కానీ.. వైసీపీ అభ్యర్ధి మాత్రం రీకౌంటింగ్‌కు డిమాండ్ చేశారు. రెండు సార్లు రీకౌంటింగ్ నిర్వహించిన అధికారులు వైసీపీ అభ్యర్ధి గెలిచినట్లుగా ప్రకటించారు. అధికారులు ఫలితాలను తారుమారు చేశారంటూ తెలుగుదేశం నేతలు గొడవకు దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు.