మా వాళ్లని చూపించండి .. అమలాపురం కోర్టు వద్ద కోనసీమ విధ్వంసం కేసు నిందితుల బంధువుల ఆందోళన
అమలాపురం జిల్లా కోర్టు వద్ద శనివారం మరోసారి ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. కోనసీమ అల్లర్ల కేసులో అరెస్ట్ అయిన నిందితుల బంధువులు ఆందోళనకు దిగారు. తమ పిల్లలకు బెయిల్ రాకుండా చేస్తున్నారంటూ కోర్టు గేట్ దగ్గర వారు బైఠాయించారు.
అమలాపురం జిల్లా కోర్టు ఎదుట కోనసీమ అల్లర్ల కేసులో అరెస్ట్ అయిన నిందితుల బంధువులు ఆందోళనకు దిగారు. నిందితులు శనివారం వాయిదాకు రాగా.. తమ వారిని చూపించాలంటూ కోర్టు దగ్గరకొచ్చి నినాదాలు చేశారు. దీంతో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. నిందితులను తల్లిదండ్రులకు కనిపించకుండా తీసుకెళ్లేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కోర్టు దగ్గర నాలుగు గంటలుగా హైడ్రామా కొనసాగుతోంది. పోలీసుల తీరుపై ఆందోళనకు దిగారు బంధువులు. మే 23న కోనసీమ జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ జరిగిన అల్లర్ల కేసులో వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నాటి ఘటనలో 258 మంది పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు నిందితులను లోపలికి తీసుకుపోవడంతో ఆందోళనకు దిగారు బంధువులు. అలాగే తమ పిల్లలకు బెయిల్ రాకుండా చేస్తున్నారంటూ కోర్టు గేట్ దగ్గర వారు బైఠాయించారు.
ALso REad:konaseema violence: మరో 18 మంది అరెస్ట్.. నిందితుల్లో ఒక మైనర్, 217కి చేరిన అరెస్ట్ల సంఖ్య
కాగా.. కోనసీమ జిల్లా పేరు మార్పును (konaseema district) వ్యతిరేకిస్తూ గత నెల 24న జిల్లా కేంద్రం అమలాపురంలో పెద్ద ఎత్తున అల్లర్లు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. అమలాపురంలో అల్లర్ల ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. పలువురిపై కేసులు నమోదు చేస్తూ, అరెస్ట్లు చేస్తున్నారు. గతవారం ఈ కేసులో వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రి విశ్వరూప్ అనుచరులు నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో విశ్వరూప్ అనుచరులను.. A-225గా సత్యరుషి, A-226గా సుభాష్, A-227గా మురళీకృష్ణ, A-228గా రఘులను చేర్చారు. A-222 నిందితుడిగా ఉన్న సత్యప్రసాద్ వాంగ్మూలంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. నలుగురు అజ్ఞాతంలో ఉన్నట్లు సమాచారం. వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.