Asianet News TeluguAsianet News Telugu

సంప్రదాయ పద్ధతిలోనే మూల్యాంకనం.. ఏపీపీఎస్సీకి హై కోర్టు షాక్...

గతేడాది విధానంలో మార్పులు జరిగినప్పుడు   సంబంధిత  వ్యక్తులందరికీ  సమాచారం ఇవ్వాలని,  కానీ  ఏపీపీఎస్సీ అలా చేయలేదని అభ్యంతరం తెలిపింది. ఎంతో మంది ఔత్సాహిక జీవితాలు ఇమిడి ఉన్నందున ప్రధాన పరీక్ష పేపర్లను సంప్రదాయ విధానంలో మూల్యాంకనం చేయాలని ఆదేశించింది.

High court judgment on group-1 exam results in andhrapradesh, shock to appsc
Author
Hyderabad, First Published Oct 2, 2021, 9:07 AM IST

అమరావతి : గ్రూప్‌-1 పరీక్ష (Group-1 Exams Results)ఫలితాల పై హైకోర్టు కీలక తీర్పు (High Court) వెలువరించింది.  ప్రధాన పరీక్ష జవాబు పత్రాలను సంప్రదాయ పద్ధతిలో మూల్యాంకనం చేయాలని ( చేతితో దిద్దాలని), ఈ ప్రక్రియను నెలలోపు పూర్తి చేయాలని ఏపీపీఎస్సీకి (APPSC)స్పష్టం చేసింది. ప్రధాన పరీక్షలు ఎంపికైన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలిచి  సాధ్యమైనంత త్వరగా ఎంపిక పూర్తి చేయాలని ఆదేశించింది.  2020లో రూల్స్‌ ఆఫ్‌ ప్రొసీజర్‌ను చట్టబద్ధంగా సవరించారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని,  దీనిద్వారా చైర్మన్ విధులు, అధికారాలను తొలగించలేరని అని స్పష్టం చేసింది. 

ఏ కారణంతో నైనా కమిషన్ కు చైర్మెన్ సహకరించకపోతే రాజ్యాంగంలోని  ఆర్టికల్ 316(1ఎ) ప్రకారం తాత్కాలిక చైర్మన్ ను నియమించాలని గవర్నర్ కు గుర్తుచేసింది.  గతేడాది విధానంలో మార్పులు జరిగినప్పుడు   సంబంధిత  వ్యక్తులందరికీ  సమాచారం ఇవ్వాలని,  కానీ  ఏపీపీఎస్సీ అలా చేయలేదని అభ్యంతరం తెలిపింది.  

ఎంతో మంది ఔత్సాహిక జీవితాలు ఇమిడి ఉన్నందున ప్రధాన పరీక్ష పేపర్లను సంప్రదాయ విధానంలో మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. యువ ఆశావహుల అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతో కష్టపడ్డారన్న విషయాన్ని గుర్తు పెట్టుకొని  ఈ వ్యవహారంలో భాగస్వాములైన వారు,  అధికారులు నిర్ణయాలు  తీసుకోవాలని తెలిపింది. 

ప్రభుత్వ అధికారులు, ఏపీపీఎస్సీ  తమ అధికారాలను ప్రజా శ్రేయస్సు కోసమే ఉపయోగిస్తారని ఆశిస్తున్నామని పేర్కొంది.  భవిష్యత్తులో నిర్వహించే పరీక్షల విషయంలో ఏపీపీఎస్సీ  డిజిటల్/అధునాతన విధానాలు అవలంబించేందుకు ప్రస్తుత ఉత్తర్వులు అవరోధం కాబోవని స్పష్టం చేసింది. అయితే కొత్త పద్ధతులు ప్రవేశపెట్టాలనే నిర్ణయాలు  పూర్తిగా చట్ట నిబంధనలకు లోబడి ఉండాలి అని తేల్చి చెప్పింది.

రిట్ పిటిషన్లను  పాక్షికంగా అనుమతిస్తున్నట్లు  ప్రకటించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు శుక్రవారం తీర్పునిచ్చారు.  గ్రూప్‌-1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాలను ఏపీపీఎస్సీ డిజిటల్ విధానంలో దిద్దించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలయ్యాయి.  ఈ వ్యాజ్యాలను విచారించిన  సింగిల్ జడ్జి  గ్రూప్ 1 ఇంటర్వ్యూ లతోపాటు తదుపరి చర్యలు అన్నింటిని నిలిపివేయాలని జూన్ 16న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.

ఈ వ్యాజ్యాలపై తుది విచారణ జరపాలని  పిటిషనర్లు,  ఇంటర్వ్యూకి  ఎంపికైన అభ్యర్థులు,  ఏపీపీఎస్సీ కోరడంతో  న్యాయమూర్తితో తుది విచారణ జరిపారు.  ఇరు వైపుల వాదనలు  ముగియడంతో  సెప్టెంబర్ 14న తీర్పును రిజర్వ్ చేశారు.  శుక్రవారం  తీర్పును వెల్లడించారు.

త్వరలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. వాటికి ప్రీలిమ్స్ పరీక్ష రద్దు: ఏపీపీఎస్సీ

తీర్పులో ఏముందంటే... సంప్రదాయ మూల్యాంకనం స్థానంలో డిజిటల్ విధానం ప్రవేశపెట్టినప్పుడు ఆ విషయాన్ని అధికారిక వెబ్సైట్ ద్వారా అభ్యర్థులకు తెలియ చేయకపోవడం పై ఏపీపీఎస్సీ సరైన కారణాలు చూపించలేదని న్యాయమూర్తి అభ్యంతరం తెలిపారు. మూల్యాంకనం చేసే వ్యక్తులు నైపుణ్యం, వారిని ఎంపిక చేసే విధానానికి సంబంధించిన వివరాలు కూడా కోర్టు ముందు ఉంచలేదని పేర్కొన్నారు. డిజిటల్ విధానంలో మూల్యాంకనం చేసేందుకు థర్డ్ పార్టీతో ఒప్పందం ఉందని ఏపీపీఎస్సీ చెబుతున్నప్పటికీ అలాంటివి కోర్టు ముందు ఉంచలేదన్నారు.

గతంలో అనుసరిస్తున్న విధానానికి సవరణ చేసినపుడు దానిని నోటిఫై చేస్తూ ప్రభుత్వం జీవోలు జారీ చేయాల్సి ఉంటుందన్నారు.  ప్రస్తుత కేసులో చైర్మెన్  అధికారాలు  కత్తిరిస్తూ చేసిన సవరణలపై ఎలాంటి జీవోలు లేవన్నారు. ఏకపక్ష విధానాలు,  నిష్పాక్షికత లోపించినప్పుడు  న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చని న్యాయమూర్తి పేర్కొన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios