ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుప్రాంతాల్లో నిన్న రాత్రి నుంచి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతుంది.
ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుప్రాంతాల్లో నిన్న రాత్రి నుంచి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతుంది. భారీ వర్షాల కారణంగా.. చాలా చోట్ల వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. కొన్ని చోట్ల రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కరెంట్ స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అకాల వర్షం వల్ల చేతికి వచ్చే పంట నీటి పాలవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
కర్నూలు జిల్లాలో పలుచోట్ల నివాస ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి. హోళగుండలో పిడుగులు పడి ఇద్దరు మృతిచెందారు. డోన్లో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతుంది. సుందర్సింగ్ కాలనీలో జడ్జి బంగ్లా అవరణంలో చెట్టుపై పిడుగు పడింది. హాలహర్వి మండలంలో కుండపోత వర్షం కురిసింది. హాలహర్వి-నిట్రవట్టి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. హాలహర్వి మండలంలో 10.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
ఉమ్మడి అనంతపుర్ జిల్లా విషయానికి వస్తే.. మడకశిరతోపాటు చుట్టుపక్క ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. మడకశిరలోని రహదారులన్నీ జలమయమయ్యాయి. చాలా సేపటి వరకు వాహనాల రాకపోకలు నిలిచాయి. అరేపేట వీధిలోని లోతట్టు ప్రాంతంలో... ఇళ్లలోకి వర్షపు నీరు చేరి... ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాత్రంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉరవకొండ, వజ్రకరూరు మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఉరవకొండ గురుకుల విద్యాలయంలో ఉండే ఇంటర్ విద్యార్థినులను పరీక్ష కేంద్రానికి తీసుకువెళ్తున్న బస్సు బురదలో నిలిచిపోయింది.
