బీజేపీతో పొత్తు పెట్టుకోలేకపోతే.. కొన్ని రాజకీయ పార్టీలకు భవిష్యత్తు లేదంటూ బీజేపీ జాతీయ నాయకులు జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజుకో కొత్త చర్చ జరుగుతునే ఉంటుంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటలు పేలడం సర్వసాధారం. తాజాగా బీజేపీ జాతీయ నాయకులు జీవీఎల్ నరసింహారావు ఏపీ రాజకీయాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకోలేకపోతే.. కొన్ని రాజకీయ పార్టీలకు భవిష్యత్తు లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నాడు విజయవాడలో బీజేపీ పదాధికారుల సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాజకీయ పార్టీల పొత్తులపై మీడియాకు, కొన్ని రాజకీయ పార్టీలకు భవిష్యత్తు పరిణామాలు అర్థం కావడం లేదని, కానీ.. తమ పార్టీకి మాత్రం చాలా స్పష్టతమైన వైఖరితో ముందుకు వెళ్తుందని, సొంతంగా ఎదిగేలా ముందుకు వెళ్తామని అన్నారు. పరోక్షంగా టీడీపీ, ఎల్లో మీడియా వైఖరిని దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా.. సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 2 మధ్య రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహించనున్నట్టు తెలిపారు.
అలాగే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ.. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడేవారు నిజాలు తెలుసుకోవాలని, నోటికి వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని ఘాటుగా స్పందించారు.
అనంతరం బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్చార్జి, జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్ మాట్లాడుతూ... కుటుంబ వారసత్వం ఉండే రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. జనసేనతో మాత్రమే తమకు పొత్తు ఉందని, టీడీపీ, వైఎస్సార్సీపీలకు సమానదూరం పాటిస్తున్నామని
ఆయన తేల్చి చెప్పారు. ఎన్డీఏ కూటమిలో తెదేపా చేరుతుందని, రానున్న ఎన్నికల్లో బీజేపీ, తెదేపా కలిసి పోటీ చేయనున్నాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా చర్చనీయంగా మారింది.
