ఏపీ సీఎస్, డిజిపి తో జాతీయ ఎస్సి కమీషన్ బృందం సమావేశం
ఆంధ్ర ప్రదేశ్ లో సంచలనంగా మారిన దళిత యువతి రమ్య హత్యకు సంబంధించిన వివరాలు సేకరించేందుకు జాతీయ ఎస్సీ కమీషన్ బృందం ఏపీ సీఎస్, డిజిపి తో పాటు ఇతర అధికారులతో సమావేశమయ్యింది.
అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దళిత యువతి రమ్య హత్యపై విచారణ కోసం జాతీయ ఎస్సి కమీషన్ బృందం మంగళవారం ఏపీకి చేరుకుంది. ఈ సందర్భంగా అమరావతి సచివాలయంలో సిఎస్ ఆదిత్యనాధ్ దాస్, డిజిపి గౌతమ్ సవాంగ్ లతో జాతీయ ఎస్సి కమీషన్ ఉపాధ్యక్షులు అరుణ్ హల్దార్ సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో కమీషన్ ఇతర సభ్యులతో పాటు ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ ఇంచార్జి ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, కమీషనర్ హర్ష వర్ధన్, పోలీస్ శాఖ డిఐజిలు రాజకుమారి, రాజశేఖర్, గుంటూరు జిల్లా రూరల్ అండ్ అర్బన్ ఎస్పీ తదితరులు పాల్గొన్నారు.
read more వేధిస్తున్న వారిపై కేసులు: ఏపీ డీజీపీ సవాంగ్ను కలిసిన రమ్య పేరేంట్స్
అంతకుముందు రమ్య హత్య జరిగిన ప్రాంతాన్ని ఎస్సీ కమిషన్ బృందం నిశితంగా పరిశీలించింది. అలాగే రమ్య కుటుంబ సభ్యులతో కొద్దిసేపు మాట్లాడారు. అనంతరం అతిథిగృహంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నుంచి వినతులు స్వీకరించారు.
ఈ సందర్భంగా కమిషన్ ఉపాధ్యక్షులుఅరుణ్ హాల్దార్ మాట్లాడుతూ... రమ్య హత్య కేసును తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. కుటుంబ సభ్యులు, వివిధ వర్గాల నుండి సమాచారాన్ని తీసుకున్నామని తెలిపారు. రమ్య హత్య కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. తప్పకుండా రమ్య కుటుంబానికి న్యాయం చేస్తామన్న కమిషన్ ఉపాధ్యక్షులు అరుణ్ భరోసా ఇచ్చారు.
రాష్ట్రానికి విచ్చేసిన జాతీయ ఎస్సీ కమీషన్ బృందానికి గన్నవరం విమానాశ్రయంలో బిజెపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఏపీ భిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెల కిషోర్ బాబు, మాలతి రాణి, ఎస్సి మోర్చా అధ్యక్షులు గుడిసె డేవానంద్, మహిళా మోర్చా అధ్యక్షురాల్ నిర్మలా కిషోర్ పలువురు దళిత నాయకులు ఎస్సీ కమీషన్ బృందానికి స్వాగతం పలికారు.