చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీం తీర్పు.. ప్రజాకోర్టులో మాత్రం తప్పించుకోలేరు : మంత్రి అమర్నాథ్
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ సీనియర్ నేత , మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు.
![gudivada amarnath reacts on supreme court judgement on tdp chief chandrababu naidu quash petition in ap skill development case ksp gudivada amarnath reacts on supreme court judgement on tdp chief chandrababu naidu quash petition in ap skill development case ksp](https://static-ai.asianetnews.com/images/01hfbdafz67v6hwsynv7kkttnn/gudivada-amarnath-jpg_363x203xt.jpg)
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ అన్వయించడంలో తమకు వేర్వేరు అభిప్రాయాలు వున్నాయని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తదుపరి చర్యల నిమిత్తం ఈ పిటిషన్ను సీజేఐ బెంచ్ సిఫారసు చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై వైసీపీ సీనియర్ నేత , మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎల్లో మీడియా చంద్రబాబుకు ఊరట కలిగినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఎలాంటి ఊరట లభించలేదని, 17ఏ సెక్షన్ అమలులోకి రాకముందే ఉన్నదే స్కిల్ డెవలప్మెంట్ కేసని ఆయన వ్యాఖ్యానించారు. తాము ఎక్కడా తప్పు చేయలేదని , అవినీతికి పాల్పడలేదని చంద్రబాబు మాట్లాడటం లేదని అమర్నాథ్ దుయ్యబట్టారు. 2015లో ఓటుకు నోటు కేసులో చంద్రబాబు దొరికినప్పుడు సెక్షన్ 8 అమల్లో వుందని తప్పించుకునే ప్రయత్నం చేశారని మంత్రి ఆరోపించారు. చంద్రబాబు బెయిల్ మీద తిరుగుతున్న దొంగ అని గుడివాడ వ్యాఖ్యానించారు. ప్రజా కోర్టులో చంద్రబాబుకు శిక్ష తప్పదని ఆయన జోస్యం చెప్పారు.
అంతకుముందు చంద్రబాబు కేసులో సరైన అనుమతులు లేకుండా ముందుకు వెళ్లారని జస్టిస్ అనిరుద్ధబోస్ వ్యాఖ్యానించారు. సెక్షన్ 17ఏ కింద ముందస్తు అనుమతులు తప్పనిసరని, లేనిపక్షంలో అది చట్ట విరుద్ధమని న్యాయమూర్తి న్నారు. అలాగే 2018 నాటి చట్ట సవరణ కంటే ముందు జరిగిన నేరాలకు ఆ సెక్షన్ వర్తించదని జస్టిస్ బేలా ఎం త్రివేది పేర్కొన్నారు. ఇద్దరు న్యాయమూర్తుల మధ్య భిన్నాభిప్రాయాలు రావడంతో సీజేఐ బెంచ్కు నివేదించారు.
కాగా.. గవర్నర్ ముందస్తు అనుమతి తీసుకోకుండా ఏపీ సీఐడీ తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టేయాలని చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరపున సిద్ధార్ధ లూథ్రా, హరీశ్ సాల్వేలు వాదనలు వినిపించారు. ఏపీ సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదించారు. వాదనలు ముగిసిన అనంతరం జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ద్వి సభ్య ధర్మాసనం కేసును గతేడాది అక్టోబర్ 17న తీర్పును వాయిదా వేసింది.