చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం తరచుగా వార్తల్లో నిలుస్తోంది. గత నెలలో పంచామృతాభిషేకం టికెట్ ధరలను పెంచిన వ్యవహారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా బంగారు విభూది పట్టి మాయం ఘటనలో ప్రధాన అర్చకులు ధర్మేశ్వర్‌పై ప్రభుత్వం వేటు వేసింది.  

చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో బంగారు విభూది పట్టి మాయం ఘటనలో ప్రధాన అర్చకులు ధర్మేశ్వర్‌పై ప్రభుత్వం వేటు వేసింది. ఆయనను సస్పెండ్ చేస్తూ ఈవో ఆదేశాలు జారీ చేశారు. విభూది పట్టిని మాయం చేసి 41 రోజుల పాటు ఇంట్లోనే పెట్టుకున్నాడు ధర్మేశ్వర్. రూ.18 లక్షల విలువైన విభూది పట్టికి రశీదు లేకపోవడంపై ఫిర్యాదు అందడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇకపోతే.. గత నెలలో కాణిపాకం ఇన్‌ఛార్జ్ ఈవో సురేష్ బాబుపై దేవాదాయ శాఖ బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. బాధ్యతల నుంచి తప్పిస్తూ దేవాదాయ శాఖ ఆదేశించింది. వినాయకుడి పంచామృతాభిషేకం టికెట్ ధరను రూ.700 నుంచి రూ.5 వేలకు పెంచుతూ సురేశ్ బాబు నోటిఫికేషన్ ఇచ్చారు. దీనిపై వివాదం రేగడంతో ఈవోపై చర్యలు తీసుకుంది ప్రభుత్వం. కాణిపాకం ఆలయ కొత్త ఈవోగా రాణా ప్రతాప్‌ను నియమించింది. అలాగే సురేష్‌బాబుకు షోకాజ్ నోటీసు సైతం జారీ చేసింది. 

ALso REad:పంచామృతాభిషేకం ధర పెంపుపై రగడ.. కాణిపాకం ఇన్‌ఛార్జ్ ఈవోపై వేటు

అంతకుముందు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలతో వరసిద్ధి వినాయక స్వామివారి పంచామృతాభిషేకం టికెట్ ధరలను భారీగా పెంచుతూ ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆలయంలో పంచామృతాభిషేకం ధర ఏడు రెట్లు పెంచారు. ప్రస్తుతం పంచామృతాభిషేకం టికెట్ ధర రూ.750లు ఉంది. అయితే, ఇప్పుడు ఏడురెట్లు పెరగడంతో రూ.750 టికెట్ ధర ఏకంగా రూ.5000లకు చేరుకుంది.

ఆలయంలో ఇప్పటి వరకూ ప్రతిరోజూ మూడుసార్లు పంచామృతాభిషేకం నిర్వహిస్తున్నారు. ఇక నుంచి ఈ సేవ భక్తులకు ఉదయం ఐదు నుంచి ఆరు గంటల వరకు కూడా అందుబాటులో ఉంచనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రత్యేక అభిషేకానికి భారీగా టికెట్ ధరను నిర్ణయించింది దేవస్థానం. అయితే ఈ పంచామృతాభిషేకం ధర పెంపు పై అభిప్రాయాలు తెలిపేందుకు ఉభయదారులకు 15 రోజుల గడువు విధించింది. ఈ మేరకు ఒక నోటీసును కూడా విడుదల చేసింది.

ఈ వార్తలతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. దీనిపై కాణిపాకం ట్రస్ట్ బోర్డ్ క్లారిటీ ఇచ్చింది. అటు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. కాణిపాకం అభిషేకం టికెట్ ధరలు పెరగలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం వున్న రూ.700 ధర యథాతథంగా వుంటుందని తెలిపారు. టికెట్ ధర పెంపుపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్న అధికారులను తొలగించాలన్నారు మంత్రి.