స్వర్ణ ప్యాలెస్, రమేష్ ఆస్పత్రిలో తనిఖీలు...కీలక పత్రాలు స్వాధీనం! (వీడియో)
రమేష్ ఆస్పత్రికి అనుబంధంగా తీసుకున్న హోటల్ స్వర్ణ హైట్స్, స్వర్ణ ప్యాలెస్లో ఒక బృందం తనిఖీలు చేసింది.
విజయవాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ స్వర్ణ ప్యాలెస్లో నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేటుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పలువురు కరోనా పేషెంట్స్ మృతిచెందగా చాలామంది క్షతగాత్రులుగా మారారు. ఈ దుర్ఘటనను సీరియస్ గా తీసుకున్న జగన్ సర్కార్ విచారణ కోసం మూడు బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృంద సభ్యులు సోమవారం దర్యాప్తు ముమ్మరం చేశారు.
రమేష్ ఆస్పత్రికి అనుబంధంగా తీసుకున్న హోటల్ స్వర్ణ హైట్స్, స్వర్ణ ప్యాలెస్లో ఒక బృందం తనిఖీలు చేసింది. ఆస్పత్రిలో కోవిడ్ పేషెంట్లకు అందిస్తున్న వైద్య ప్రమాణాలపై కూడా దర్యాప్తు చేస్తోంది. మరోబృందం షార్ట్ సర్క్యూట్కు గల కారణాలపై తనిఖీలు చేస్తోంది. మూడవ బృందం ఫైర్ సేఫ్టీ నామ్స్ ఏ విధంగా ఉన్నాయన్నదానిపై పరిశీలిస్తోంది. సోమవారం ఉదయం నుంచి వివిధ ప్రాంతాల్లో వివిధ విభాగాల అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
స్వర్ణ ప్యాలెస్ యజమాని ముత్తవరపు శ్రీనివాస్ ఇంట్లో కూడా అధికారులు తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన ఇంటిలోపలికి బయటివారు ఎవరినీ పోలీసులు అనుమతించలేదు. అగ్రిమెంట్కు సంబంధించి కీలకమైన పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
"
ఫైర్ నిబంధనలు పాటించకపోవడం, భద్రతా ప్రమాణాలు మరియు షార్ట్ సర్య్కూట్కు గల కారణాలపై అధికారులు, పోలీసులు పరిశీలిస్తున్నారు.స్వర్ణప్యాలెస్, స్వర్ణ హైట్స్లో విద్యుత్ శాఖ అధికారులు, ఫైర్ సిబ్బంది పరిశీలించారు. మరోవైపు.. రమేష్ ఆస్పత్రి ఆధ్వర్యంలో జరిగిన కోవిడ్ ట్రీట్మెంట్పై వివరాలు అధికారులు సేకరిస్తున్నారు. స్వర్ణ హైట్స్, స్వర్ణ ప్యాలెస్ సంబంధించి నిబంధనల ప్రకారం నిర్మాణ కొలతలు ఉన్నాయా..? లేదా..? అని పోలీస్, అగ్నిమాపక అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
ఇదిలా ఉంటే స్వర్ణ ప్యాలెస్లో అగ్ని ప్రమాద స్థలాన్ని జిల్లా కమిటి బృందం పరిశీలించింది. సబ్ కలెక్టర్ ధ్యాన్ చంద్ర, జిల్లా జాయిట్ కలెక్టర్ (అభివృద్ధి) శివ శంకర్, విఎంసీ హెల్త్ ఆఫీసర్, డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ పరిశీలించారు. ఈ పరిశీలన అనంతరం ప్రభుత్వానికి వారు ఓ నివేదికను అందించనున్నారని తెలుస్తోంది.