ఆంధ్రప్రదేశ్‌లోని పారిశుద్ధ్య కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పారిశుద్ద్య కార్మికులకు ఆక్యుపెన్సీ హెల్త్ అలవెన్స్‌ చెల్లింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌లోని పారిశుద్ధ్య కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పారిశుద్ద్య కార్మికులకు ఆక్యుపెన్సీ హెల్త్ అలవెన్స్‌ చెల్లింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రకారం వారికి నెలకు రూ.6 వేలు ఈ అలవెన్స్ కింద అదనంగా చెల్లించనున్నారు. ఈ మేరకు జీవో నెంబర్ 233 ని ప్రభుత్వం విడుదల చేసింది. ప్రస్తుతం పారిశుద్ధ్య కార్మికులకు మూలవేతనంగా రూ.15 వేలు అందుతున్నది. ఆక్యుపెన్సీ హెల్త్ అలవెన్స్‌తో కలిసి వారికి నెలకు రూ.21 వేలకు అందనుంది. తాజా ఉత్తర్వులతో దాదాపు 43 వేల మందికి పైగా కార్మికులు లబ్ధి చేకూరనుంది. 

తమ డిమాండ్లను పరిష్కరించాలని ఏపీలో ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ మున్సిపల్‌ కార్మికులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల పాటు నిరసన కొనసాగించారు. ఈ క్రమంలోనే సీఎం జగన్.. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రి ఆదిమూలపు సురేష్‌ను ఆదేశించారు. ఈ క్రమంలోనే కార్మికులకు 15 వేల కనీస వేతనాలతో పాటు నెలకు 6 వేల ఆరోగ్య భత్యం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది.