టీవీ చూస్తోందని మందలించిన తండ్రి.. మనస్తాపంతో....
టీవీ చూస్తున్న ప్రసన్నను తండ్రి మాధవరావు మందలించాడు. త్వరలో ఉద్యోగాల నోటిఫికేషన్ ఉందని, చదువుకొని మంచి ఉద్యోగం సాధించాలని చెప్పాడు.
టీవీ చూస్తోందని కూతురిని ఓ తండ్రి మందలించాడు. కాగా.... దీంతో మనస్థానికి గురై ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కొత్తపల్లి మండలం బొట్లగూడూరులో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే... గ్రామానికి చెందిన చీమలదిన్నె మాధవరావు, పద్మలు కిరాణాదుకాణం నిర్వహిస్తూ పిల్లలను చదివిస్తున్నారు. కుమార్తె దేవీ ప్రసన్న(20) ఒంగోలులో అగ్రికల్చల్ బీఎస్సీ, కుమారుడు విజయవాడలో ఇంటర్మీడియెట్ చదివిస్తున్నారు. ఇటీవల లాక్డౌన్తో ఇద్దరూ ఇంటికి వచ్చారు.
ఈ క్రమంలో శనివారం రాత్రి 8 గంటల సమయంలో టీవీ చూస్తున్న ప్రసన్నను తండ్రి మాధవరావు మందలించాడు. త్వరలో ఉద్యోగాల నోటిఫికేషన్ ఉందని, చదువుకొని మంచి ఉద్యోగం సాధించాలని చెప్పాడు. అనంతరం ఎప్పటిలాగే రాత్రి భోజనం చేసి నిద్రపోయారు.
దేవీ ప్రసన్న వరండాలో నిద్రపోగా మిగిలిన వారంతా ఇంట్లో పడుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో పద్మ నిద్ర లేచి ఇంట్లోకి వెళ్లగా కుమార్తె ప్రసన్న ఉరేసుకొని వేలాడుతూ కనిపించడంతో కేకలు వేసింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను కింద దించగా అప్పటికే మృతి చెందింది.
దీంతో ఒక్కసారిగా కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కనిగిరి వైద్యశాలకు తరలించారు.