గన్నవరం వైసీపీలో మరోసారి కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈరోజు వైసీపీ ఎంపీ బాలశౌరి.. దుట్టా రామచంద్రరావుతో భేటీ కానుండటం చర్చనీయాంశంగా మారింది.

గన్నవరం వైసీపీలో మరోసారి కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో గన్నవరంలో టీడీపీ నుంచి విజయం సాధించిన వల్లభనేని వంశీ.. ఆ తర్వాత వైసీపీకి మద్దతుగా మారారు. వంశీని మొదట్నుంచీ గన్నవరం వైసీపీ నేతలు యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు వ్యతిరేకిస్తూ వచ్చారు. వీరిద్దరు కూడా గతంలో వంశీపై వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేసి ఓడినవారే. ఈ క్రమంలోనే వీరిద్దరు వంశీకి వ్యతిరేకంగా కలిసికట్టుగా పనిచేశారు. అయితే కొంతకాలంగా వైసీపీ అధిష్టానం తీరుపై అసంతృప్తిగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు.. టీడీపీ గూటికి చేరారు. అయితే దుట్టా రామచంద్రరావు మాత్రం వైసీపీలోనే ఉండిపోయారు. 

గన్నవరం వైసీపీలో పరిణామాలపై సీఎం జగన్ దృష్టి సారించి దుట్టా రామచంద్రరావుతో భేటీ అయ్యారని.. ఈ క్రమంలోనే ఆయన పార్టీలో కొనసాగుతున్నారనే ప్రచారం కూడా వినిపిస్తోంది. అయితే దుట్టా రామచంద్రరావు వైసీపీలో ఉన్న తమకే సహకరిస్తాడన్న యార్లగడ్డ వెంకట్రావు వర్గం చెబుతోంది. ఈ క్రమంలోనే ఈరోజు వైసీపీ ఎంపీ బాలశౌరి.. దుట్టా రామచంద్రరావుతో భేటీ కానుండటం చర్చనీయాంశంగా మారింది. వంశీతో కలిసి పనిచేయాలని అధిష్టానం మాటను దుట్టాకు చెప్పేందుకు బౌలశౌరి ఆయనను కలవబోతున్నారనే ప్రచారం సాగుతుంది. దీంతో గన్నవరం వైసీపీలో పరిణామాలు ఉత్కంఠగా మారాయి. 

అయితే ఈ పరిణామాలపై ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ.. దుట్టా రామచంద్రరావు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడని అన్నారు. తనకు 2004 నుంచి ఆయనతో పరిచయం ఉందని.. తరుచూ తాము కలుస్తూ ఉంటామని చెప్పారు. తాను ఈరోజు దుట్టాను కలిసేదానిలో ఎలాంటి రాజకీయం లేదని తెలిపారు. దుట్టా రామచంద్రరావు వైసీపీలో ఉన్నారని.. జగన్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తారని అన్నారు. పార్టీకి నష్టం కలిగించే పనులు చేయరని కూడా చెప్పారు. వైసీపీలో ఆయనకు ఉండే గౌరవం ఎప్పుడూ అలానే ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు అందరం కలిసి పనిచేస్తామని చెప్పారు. రాష్ట్రంలో దొంగ నోట్ల అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు.