భార్య ఆత్మహత్య: లండన్ నుండి వచ్చి భర్త సూసైడ్
భార్య ఆత్మహత్య చేసుకొన్న విషయం తెలుసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్యాభర్తలు మృతి చెందడంతో చిన్నారి అనాధగా మారింది.

హైదరాబాద్:చిన్న వివాదం భార్యాభర్తల ఆత్మహత్యకు కారణమైంది. వీరిద్దరూ ఆత్మహత్యకు పాల్పడడంతో చిన్నారి అనాధగా మారింది.
ప్రకాశం జిల్లా మార్టూరుకు చెందిన మెట్టెల గంగయ్య, ఇదే మండలంలోని జొన్నతాళికి చెందిన శివరాత్రి రమాదేవి మూడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు.సైన్సులో పీజీ చేసే సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.
తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పి వారి అంగీకారంతో వారిద్దరూ పెళ్లిచేసుకొన్నారు.వీరిద్దరూ ఉద్యోగం కోసం సౌదీకి వెళ్లారు. రమాదేవి గర్భవతి కావడంతో ఏడాదిన్నర క్రితం ఆమెను పుట్టింటికి పంపాడు.
అదే సమయంలో మంచి ఉద్యోగం రావడంతో గంగయ్య లండన్ కు వెళ్లాడు.భార్యను కూతురును చూసేందుకు గంగయ్య నెల రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు.భార్యాను పీహెచ్డీ చేయాలని ఒత్తిడి చేశాడు. సౌదీలో ఉన్న సమయంలో కూడ భార్యను పీహెచ్డీ చేయాలని కోరాడు. కానీ, ఆమె మాత్రం ససేమిరా అంది.
నెల రోజుల క్రితం ఇంటికి వచ్చిన సమయంలో కూడ పీహెచ్డీ విషయంలో మరోసారి భార్యను కోరారు. ఆమె మాత్రం ఒప్పుకోలేదు.పీహెచ్ డీ చేయకపోతే లండన్ తీసుకెళ్లనని గంగయ్య తెగేసి చెప్పాడు.
దీంతో గంగయ్యకు రమాదేవికి మధ్య చిన్న గొడవ జరిగింది. ఆగష్టు 29వ తేదీన గంగయ్య లండన్ కు చేరుకొన్నాడు.అదే రోజున సాయంత్రం రమాదేవి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.ఈ విషయం తెలిసిన వెంటనే గంగయ్య లండన్ నుండి స్వగ్రామానికి తిరిగి బయలుదేరాడు.
ఆగష్టు 30వ తేదీ సాయంత్రం గంగయ్య హైద్రాబాద్ కు చేరుకొన్నాడు. కానీ ఆయన స్వంత ఊరుకు వెళ్లలేదు.ఘట్ కేసర్- బీబీనగర్ రైల్వేస్టేషన్ల మధ్య శనివారం నాడు రైల్వే పోలీసులు మృతదేహన్ని గుర్తించారు.
మృతదేహం వద్ద లభించిన ఓటరు ఐడీ కార్డు, ఆధార్ కార్డుల ఆధారంగా మృతుడు గంగయ్యగా పోలీసులు గుర్తించారు.గంగయ్య కోసం ఎదురుచూస్తున్న కుటుంబసభ్యులకు ఆయన కూడ మృతి చెందడం ఆశనిపాతంగా మారింది.