జేసీ ప్రభాకర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్, కొడుకుతో సహా అనంత జైలుకు తరలింపు
బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా రిజిస్ట్రేషన్ చేసి వ్యాపారం నిర్వహించిన నేరంపై అరెస్టయిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని అనంతపురం జైలుకు తరలించారు.
బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా రిజిస్ట్రేషన్ చేసి వ్యాపారం నిర్వహించిన నేరంపై అరెస్టయిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని అనంతపురం జైలుకు తరలించారు.
మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి తాను వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు పోలీసులకు చెప్పారు. హైదరాబాదులో అరెస్టు చేసి ఆయనను అనంతపురం తరలించారు. అనంతపురం పోలీసు స్టేషన్ లో ఆయనను మూడు గంటలపాటు విచారించారు. వాహనాల కొనుగోలు గురించి ఆ విచారణ జరిగింది.
ఆ తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డిని ప్రబుత్వాస్పత్రికి తరలించారు. జేసీ ప్రభాకర్ రెడ్డిని, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని అరెస్టు చేసి అనంతపురం తీసుకుని వచ్చిన నేపథ్యంలో పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. జేసీ అనుచరులు పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
154 బస్సులకు సంబంధించి నకిలీ ఎన్ఓసీలు సృష్టించిన కేసులో వారిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఇరువురిని పోలీసులు అనంతపురానికి తరలిస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టును పోలీసులు ధృవీకరించారు. అనంతపురం మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రి ఎమ్మెల్యేగా జేసీ ప్రభాకర్ రెడ్డి పనిచేశారు.
బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4గా రిజిస్ట్రేషన్ చేసి అమ్మకాలు సాగించినట్లు తేలడంతో వారిద్దరిని అరెస్టు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరపగా నకిలీ పత్రాలు సృష్టించి ఇప్పటి వరకు 154 వాహనాలను నాగాలాండ్ లో రిజిస్ట్రేషన్ చేయించినట్లు తేలింది.
వాటికి సంబంధించిన నకిలీ ఎన్ఓసీ, నకిలీ ఇన్సూరెన్స్ ల కేసుల్లో వారిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. నకిలీ రిజిస్ట్రేషన్లకు సంబంధింంచి జేసీ ట్రావెల్స్ మీద 24 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, తాడిపత్రి పోలీసు స్టేషన్లలో జేసీ ట్రావెల్స్ మీద 27 కేసులు నమోదయ్యాయి.