ప్రకాశం జిల్లాలో టీడీపీకి ఎదురు దెబ్బ: టీడీపీకి కదిరి బాబూరావు గుడ్ బై
ప్రకాశం జిల్లాలో నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీకి ఎదురు దెబ్బ తగలనుంది. మాజీ శాసనసభ్యుడు కదిరి బాబూరావు టీడీపీకి రాజీినామా చేసి వైసీపీలో చేరేందుకు సిద్ధపడ్డారు.
ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. తాజాగా, ప్రకాశం జిల్లాలో టీజీపీకి ఎదురు దెబ్బ తగులబోతోంది. మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నారు.
2014లో ఆయన కనిగిరి నుంచి టీడీపీ తరఫున పోటీ చేశారు. ఆయన మధ్యాహ్ననం 3 గంటలకు జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకుంటారు. టీడీపీ నాయకత్వంపై అసంతృప్తితోనే ఆయన పార్టీ మారాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. కదిరి బాబూరావు హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడు.
ఇదిలావుండగా, కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మరో భారీ షాక్ తగలనుంది. పులివెందులలో టీడీపీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చిన సతీష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.
ఇప్పటికే కడప డిల్లా జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరేందుకు సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి. కడప జిల్లా నుంచి సాధ్యమైనంత ఎక్కువ మంది పెద్ద నాయకులను తమ పార్టీలో చేర్చుకోవడానికి వైసీపీ గాలం వేస్తోంది.
పార్టీ మార్పు విషయంపై చర్చించేందుకు సతీష్ రెడ్డి మంగళవారం తన అనుచరులతో సమావేశమవుతున్నారు. ఈ నెల 13వ తేదీన ఆయన తాడేపల్లి నివాసంలో వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరే అవకాశం ఉంది.
సతీష్ రెడ్డి పులివెందుల శాసనసభా నియోజకవర్గంలో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డిపై, వైఎస్ జగన్ పై పోటీ చేశారు. ఆ రకంగా పులివెందుల నియోజకవర్గంలో చంద్రబాబుకు సతీష్ రెడ్డి పార్టీ మారడం వల్ల పెద్ద దెబ్బనే తగిలే అవకాశం ఉంది.
జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆదినారాయన రెడ్డి వైసీపీ నుంచి టీడీపీలో చేరిన తర్వాత రామసుబ్బా రెడ్డి తీవ్రంగా చిక్కులు ఎదుర్కుంటున్నారు. అయినప్పటికీ ఆయన టీడీపీలో కొనసాగుతూ వచ్చారు. కానీ, వైసీపీలో చేరేందుకు ఆయన సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి.