బీజేపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు..
మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు లేఖ రాశారు.
![Former Minister Ravela Kishore Babu Resigns BJP Former Minister Ravela Kishore Babu Resigns BJP](https://static-ai.asianetnews.com/images/38f7ed88-d091-4014-aed2-2b4017c5ced8/image_363x203xt.jpg)
మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు లేఖ రాశారు. అంబేడ్కర్ పట్ల ప్రధాని మోదీకి ఉన్న గౌరవం, అభిమానం తనను బీజేపీ వైపు ఆకర్షితుడిని చేశాయని పేర్కొన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలు తగ్గి ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా రూపొందడానికి భారతదేశానికి ప్రధాని మోదీ నాయకత్వం అవసరం అని భావిస్తున్నట్టుగా చెప్పారు. పార్టీకి, తన పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా లేఖలో పేర్కొన్నారు పార్టీలో సముచిత స్థానం కల్పించినందుకు ధన్యవాదాలు చెప్పారు. వ్యక్తిగత కారణాలతో బీజేపీలో కొనసాగలేకపోతున్నానని చెప్పారు.
కాగా, రావెల కిషోర్ బాబు కొంతకాలంగా బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే రావెల కిషోర్ బాబు మళ్లీ టీడీపీ గూటికి చేరతారనే ప్రచారం సాగుతుంది. ఆయన ఈనెల 27, 28 తేదీల్లో ఒంగోలులో జరిగే మహానాడులో ఆయన చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరతారనే వార్తలు కూడా వెలువడుతున్నాయి. మరి ఈ వార్తల్లో నిజానిజాలు మరికొన్ని రోజుల్లోనే తెలియనున్నాయి.
ఇక, గతంలో రావెల కిశోర్ బాబు ఐఆర్టీఎస్ అధికారిగా పని చేశారు. 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. చంద్రబాబునాయుడు మంత్రి వర్గంలో రావెలకు చోటు దక్కింది. రావెల కిషోర్ బాబు కారణంగా పార్టీకి ఇబ్బందులు ఏర్పడ్డాయని పార్టీ నాయకత్వం భావించింది. దీంతో మంత్రివర్గం నుండి రావెల కిషోర్ బాబును చంద్రబాబు తొలగించారు. దీంతో మనస్తాపం చెందిన రావెల కొంతకాలం పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.
తర్వాత 2019 ఎన్నికలకు కొన్ని నెలల ముందు జనసేన పార్టీలో చేరారు. అయితే ఆ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే రావెల జనసేనను వీడి.. బీజేపీలో చేరారు. కాషాయ కండువా కప్పుకున్న కొత్తలో ఆయన పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా కొనసాగారు. అయితే కొంతకాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన సొంతగూటికి తిరిగిరావాలని చూస్తున్నారనే ప్రచారం సాగుతుంది.