సారాంశం

చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని టీడీపీ క్యాడర్ తో పాటు ప్రజలు భావిస్తున్నందునే  నిన్న జరిగిన మోత మోగిద్దాం కార్యక్రమంలో  ఎవరూ పాల్గొనలేదని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. 

అమరావతి: చేసిన పాపాలకు చంద్రబాబు శిక్ష అనుభవించక తప్పదని మాజీ మంత్రి పేర్ని నాని చెప్పారు.శనివారం నాడు రాత్రి   మోత మోగిద్దాం అని టీడీపీ ఇచ్చిన నిరసన కార్యక్రమంపై   పేర్ని నాని  విమర్శలు చేశారు.తాడేపల్లిలో ఆదివారంనాడు మాజీ మంత్రి పేర్నినాని మీడియాతో మాట్లాడారు.    చంద్రబాబు అవినీతి కేసులో జైలుకు వెళ్లడం  టీడీపీ కార్యకర్తలకు ఆవేదన ఉన్నట్టుగా కన్పించలేదన్నారు. లంచాలు తిని కంచాలు మోగిస్తారా అని ఆయన సెటైర్లు వేశారు. అందుకే నిన్న అంతా నవ్వుకుంటూ  విజిల్స్ , మోత మోగించారని ఆయన ఎద్దేవా చేశారు. 

కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు గతంలో హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు.   ఈ విషయమై  ముద్రగడ పద్మనాభం  నిరసనకు దిగితే ఆయనను చంద్రబాబు సర్కార్ వేధించిందని పేర్నినాని విమర్శించారు. అక్రమ కేసులు అయితే  కోర్టుల్లో  బాబుకు అనుకూలంగా తీర్పులు ఎందుకు రావడం లేదని ఆయన  ప్రశ్నించారు.  కోటి మంది టీడీపీ సభ్యులు ఉంటే.. మోత మోగిద్దాం కార్యక్రమంలో ఎంత మంది పాల్గొన్నారని ఆయన ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో ఎందుకు  టీడీపీ కేడర్ పాల్గొనలేదని ఆయన అడిగారు. నిరసన కార్యక్రమాలను కేవలం  రాజకీయ కార్యక్రమాలుగా మాత్రేమ చేశారన్నారు.

జగన్ పై పెట్టిన కేసులు అక్రమమమని ప్రజలు నమ్మినందునే ఆయనను ప్రజలు గెలిపించారన్నారు.తనపై నమోదు చేసిన కేసుల్లో  జగన్  నిర్ధోషిగా బయటపడుతారని  పేర్ని నాని ఆశాభావం వ్యక్తం చేశారు. తనపై నమోదైన కేసుల్లో చంద్రబాబు నిజాయితీని నిరూపించుకోవాలని ఆయన సలహా ఇచ్చారు.  అక్రమాస్తులపై  కేసులు వేస్తే  చంద్రబాబు కోర్టుల్లో స్టేలు తెచ్చుకున్నారని  పేర్ని నారి  విమర్శించారు. కేసులపై స్టే లతోనే చంద్రబాబు బతికాడని ఆయన ఎద్దేవా చేశారు.జీవిత ఖైదు తప్పదనే చంద్రబాబు స్టేలు తెచ్చుకున్నారన్నారు.