నిన్న తెలంగాణలోని హైదరాబాద్ లో అరెస్టైన మాజీమంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణకు మంగళవారం రాత్రి బెయిల్ మంజూరయ్యింది. రూ. లక్ష చొప్పున ఇద్దరు జామీను ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు.
చిత్తూరు : నారాయణ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు ఏపీ మాజీ మంత్రి నారాయణకు బెయిల్ లభించింది. వ్యక్తిగత పూచీకత్తుతో న్యాయమూర్తి సులోచనారాణి బెయిల్ మంజూరు చేశారు. పదో తరగతి ప్రశ్నా పత్రాలు లీక్ కేసులో చిత్తూరు జిల్లా పోలీసులు నారాయణను హైదరాబాదులో నిన్న అరెస్టు చేసి చిత్తూరు తరలించారు. మంగళవారం రాత్రి వైద్యపరీక్షల నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ తర్వాత నారాయణ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. ఈ సందర్భంగా పోలీసుల అభియోగాలను న్యాయమూర్తి తోసిపుచ్చారు. 2014లోనే నారాయణ విద్యా సంస్థల చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు ఆయన తరఫున న్యాయవాదులు న్యాయమూర్తికి ఆధారాలు చూపించారు. దీంతో ఆ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. ఈ సందర్భంగా రూ. లక్ష చొప్పున ఇద్దరు జామీను ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు.
ఆయనకు బెయిల్ లభించిన తరువాత ఆయన తరఫు న్యాయవాది మాట్లాడారు. నారాయణ విద్యాసంస్థల అధినేతగా ఉన్నారని నారాయణపై పోలీసులు అభియోగం మోపారు. కానీ, 2014లోనే ఆ విద్యాసంస్థల అధినేతగా ఆయన వైదొలిగినట్లు పేర్కొన్నారు. నారాయణ విద్యాసంస్థలతో తనకు సంబంధం లేదని, దానికి సంబంధించిన డాక్యుమెంట్లు న్యాయమూర్తికి సమర్పించినట్లు తెలిపారు. నేరారోపణ నమ్మే విధంగా లేదని జడ్జి అభిప్రాయానికి వచ్చినట్లు చెప్పారు. ఘటన జరిగిననాటికి నారాయణ ఆ విద్యాసంస్థల అధినేత కాదని జడ్జి అభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు. ఈ నెల 18లోగా రూ. లక్ష చొప్పున ఇద్దరి పూచీకత్తు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారని, నారాయణ పై పోలీసులు అభియోగాలను నిరూపించలేదని న్యాయవాది అన్నారు.
అసలేం జరిగిందంటే..
పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారానికి సంబంధించి నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు మాజీ మంత్రి నారాయణ మంగళవారం ఉదయం చిత్తూరు జిల్లా పోలీసులు హైదరాబాదులో అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి మంగళవారం రాత్రి ఆయన నుంచి చిత్తూరు కి తరలించారు. ఏప్రిల్ 27న చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలోని జడ్పీ ఉన్నత పాఠశాల నుంచి పదో తరగతి తెలుగు ప్రశ్న పత్రం వాట్స్అప్ ద్వారా బయటకు వచ్చిన కేసులో నారాయణ పాత్ర ఉన్నట్లు తేలడంతో ఆయనను అరెస్టు చేశామని తెలంగాణ పోలీసులకు చిత్తూరు పోలీసులు వివరించారు. హైదరాబాద్ నుంచి తరలించేవరకు నారాయణ ఉన్న వాహనాన్ని టీడీపీ శ్రేణులు అడ్డుకుంటాయని.. ఆయన ఆచూకీ తెలియకుండా ఉండడానికి పలుమార్లు వాహనాలు మార్చి రాత్రి చిత్తూరుకు తరలించారు.
నారాయణ కళాశాల డీన్ బాలగంగాధర్ ను తిరుపతిలో అరెస్టు చేశారు. నెల్లేపల్లి కేంద్రంగా ఏప్రిల్ 27న జరిగిన పదో తరగతి తెలుగు ప్రశ్న పత్రం మాల్ ప్రాక్టీస్ వ్యవహారంలో నారాయణుడు మంగళవారం ఉదయం హైదరాబాద్లో అరెస్టు చేసినట్లు చిత్తూరు ఎస్ పి రిశాంత్ రెడ్డి వెల్లడించారు. ప్రశ్నాపత్రం వాట్సాప్ గ్రూప్ లో చక్కర్లు కొట్టడంపై చిత్తూరు డీఈవో ఫిర్యాదు చేయడంతో ఒకటో పట్టణ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. చిత్తూరులో మంగళవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. మాల్ ప్రాక్టీస్ ఘటనలో మాజీమంత్రి నారాయణ, డీన్ బాల గంగాధర్ ల పాత్రకు ఆధారాలు ఉన్నాయా? అని అడగ్గా.. వాటి గురించి ఇప్పుడే చెప్పలేమని కోర్టులో సమర్పిస్తామని తెలిపారు.
