టీడీపీలో జేసీ వ్యాఖ్యల చిచ్చు: కాల్వ మనస్తాపం, రాయదుర్గానికే పరిమితం
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మెన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు మనస్తాపానికి గురయ్యారు. దీంతో ఆయన రాయదుర్గం నియోజకవర్గానికే పరిమితం కావాలని నిర్ణయం తీసుకొన్నారు.
అనంతపురం: టీడీపీలో తాడిపత్రి మున్సిపల్ ఛైర్మెన్, మాజీఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. టీడీపీ అనంతపురం పార్టీ అధ్యక్ష పదవి నుండి తప్పుకోవాలని మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు నిర్ణయం తీసుకొన్నారు.
రాయలసీమ నీటి ఉద్యమంపై ఇటీవల జరిగిన సమావేశంలో తాడిపత్రి మున్సిపల్ ఛైర్మెన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. కార్యకర్తల గురించి ఇంత కాలం పట్టించుకోకుండా ఇవాళ సమావేశం ఏర్పాటు చేసి ఉద్యమం పేరుతో కార్యక్తలు రావాలంటే ఎందుకు వస్తారని ఆయన ప్రశ్నించారు.అంతేకాదు మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు లక్ష్యంగా చేసుకొని వ్యాఖ్యలు చేశారు.
also read:కాల్వ శ్రీనివాసులపై వ్యాఖ్యలు.. జేసీ ప్రభాకర్ రెడ్డికి పయ్యావుల కౌంటర్
ఈ వ్యాఖ్యలకు పయ్యావుల కేశవ్ తో పాటు మరికొందరు నేతలు కౌంటర్ ఇచ్చారు. కానీ పార్టీ నాయకత్వం ఇంతవరకు స్పందించలేదు. దీంతో మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు మనస్తాపానికి గురయ్యారు. ఈ విషయమై అనంతపురం పార్లమెంటరీ అధ్యక్ష పదవి నుండి తప్పుకోవాలని ఆయన భావిస్తున్నారు. మరో వైపు రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గానికే పరిమితం కావాలని ఆయన నిర్ణయం తీసుకొన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ తన అభ్యర్ధులను బరిలోకి దింపలేదు. కానీ తాడిపత్రిలో జేసీ సోదరులు బరిలో తమ అభ్యర్ధులను నిలిపారు. తాడిపత్రిలో విజయం సాధించారు.