తాను చేసిన తప్పు ఏమిటో చెబితే  రాజకీయాల  నుండి తప్పుకొంటానని  మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి  చెప్పారు. 

ఒంగోలు: వైసీపీ  బలోపేతం  కోసం  తాను  ఎంతో కృషి  చేశానని  మాజీ మంత్రి  బాలినేని శ్రీనివాస్ రెడ్డి  చెప్పారు.  తాను  చేసిన తప్పు ఏమిటీో  చెబితే  రాజకీయాల నుండి వైదొలుగుతానని  ఆయన  సంచలన వ్యాఖ్యలు  చేశారు.

శుక్రవారంనాడు  ఆయన  ఒంగోలులో మీడియాతో మాట్లాడారు. తాను టిక్కెట్టు ఇప్పించిన వాళ్లే తనపై  పార్టీ అధిష్టానానికి  ఫిర్యాదు  చేస్తున్నారని  బాలినేని శ్రీనివాస్ రెడ్డి  ఆవేదన వ్యక్తం  చేశారు.  మీడియా సమావేశంలో  ఆయన ఒకానొక దశలో  భావోద్వేగానికి గురయ్యారు. కొంతమంది నియోజకవర్గ ఇంచార్జీలు  తనపై అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారన్నారు.. ఎప్పుడూ పార్టీ కార్యకర్తల కోసం పనిచేశానని ఆయన  గుర్తు  చేశారు.  

ఏం చేయకపోయినా తనపై, తన కొడుకుపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం  చేశారు.  ఈ  ఆరోపణలను తాను   భరించలేకపోతున్నానని ఆయన  చెప్పారు.   ఈ పరిణామాలు చూసి చాలా బాధపడుతున్నానని ఆయన  చెప్పారు.

గడపగడపకు తిరగటం వల్ల మూడు జిల్లాల కోఆర్డినేటర్ గా పనిచేయలేక పోతున్నానని సీఎంకు వివరించినట్టుగా   బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు

1987 నుంచి యూత్ కాంగ్రెస్ లో ఉంటూ విలువలతో కూడిన రాజకీయం చేశానని ఆయన గుర్తు  చేసుకున్నారు.  1999 లో వైఎస్  రాజశేఖర్ రెడ్డి కారణంగా తనకు   ఎమ్మెల్యే పదవి దక్కిందన్నారు. .ఆ తర్వాత 2009లో వైఎస్ఆర్ చలవ వల్ల మంత్రి అయ్యానన్నారు. .

వైఎస్ఆర్  మరణాంతరం  జగన్ కోసం మంత్రి పదవి వదులుకొన్నట్టుగా  బాలినేని శ్రీినవాస్ రెడ్డి గుర్తు  చేసుకున్నారు.  పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీలో కీలక నేతగా ఉన్నట్టుగా  చెప్పారు.అందరితో సత్సంబంధాలు ఉన్నాయన్నారు. ఈ మధ్యకాలంలో తనపై  రకరకాల ఆరోపణలు చేస్తున్నారని  ఆయన చెప్పారు.

వైవీ సుబ్బారెడ్డి బిక్షతో తనకు ఎమ్మెల్యే పదవి దక్కిందని గోనె ప్రకాశరావు లాంటి వ్యక్తులు చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు.  జగన్ ను , విజయమ్మను విమర్శిస్తాడు... వైవి సుబ్బారెడ్డిని పొగుడుతాడు... ఇదేమి రాజకీయమని  ఆయన ప్రశ్నించారు.  .తాను పార్టీ మారుతానని  తమ పార్టీకి చెందినవారే  ప్రచారం చేస్తున్నారని  ఆయన ఆరోపించారు  తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా  తాను పార్టీ మారబోనని  ఆయన స్పష్టం  చేశారు.