Asianet News TeluguAsianet News Telugu

పరిటాల రవిలాగే నన్ను కూడా చంపేస్తారని నా భార్య భయం.. కానీ ఎన్నాళ్ళు భయపడతాం?... ఆదినారాయణరెడ్డి

అమరావతి రైతుల ఉద్యమం 800వ రోజుకు చేరుకున్న సందర్భంగా వారికి మద్దతుగా టీడీపీ, బీజేపీ నేతలు మాట్లాడారు. ఈ క్రమంలో మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ తనను చంపేస్తారేమోననని భార్య భయపడుతోందనడం.. కొత్త అనుమానాలకు తెరలేపింది.
 

former minister adinarayana reddy comments on ys jagan
Author
Hyderabad, First Published Feb 25, 2022, 8:31 AM IST | Last Updated Feb 25, 2022, 8:31 AM IST

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన కొనసాగుతోందనేందుకు అమరావతి అంశమే నిదర్శనమని BJP నేత, మాజీ మంత్రి Adinarayana Reddy అన్నారు. అమరావతి ఉద్యమం 800వ రోజుకు చేరిన సందర్భంగా farmersకు మద్దతుగా ఆయన మాట్లాడారు. విశాఖలో సీఎం YS Jagan భూములు ఉన్నాయని.. అందుకే అక్కడే రాజధాని అంటున్నారని ఆరోపించారు. జగన్ అధికారంలోకి వస్తే రాజధాని విశాఖకు మారుస్తారని.. గతంలో కేబినెట్ మంత్రిగా ఉన్నప్పుడే చంద్రబాబుకు చెప్పానని, ఇప్పుడు అదే నిజమైంది అన్నారు.

‘రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే విశాఖలో భూములు కొన్నారు. ఆ భూములకు మంచి ధర రావాలంటే.. రాజధాని అక్కడ పెట్టాలని జగన్ ఆలోచన.  ఇలాంటి దొంగ వ్యక్తి ఉంటే రాష్ట్రానికి మంచి జరగదు.  మంచి చేయమంటే చెడు చేస్తారు. చెడు చేయమంటే మంచి చేస్తారు.  సొంత బాబాయిని చంపి, వాళ్లే కడిగి, కుట్లు కూడా వేశారు. వారి సొంత టీవీ ఛానల్లో గుండెపోటు అని ప్రచారం… ఆ తర్వాత గుండెల్లో పోటు అని మార్చారు. 

వివేకా కేసులో నా పైనా, చంద్రబాబుపైనా మొదట నిందలు వేశారు. ఆ కేసులో వాస్తవాలు ఇప్పుడు బయటికి వస్తున్నాయి. పరిటాల రవిని చంపించినట్టుగా నన్ను కూడా చంపుతారేమోనని నా భార్య భయపడుతోంది. ఎన్నాళ్ళు భయపడతాం? ఏం జరిగినా ధైర్యంగా ఉండమని నా భార్యకు చెప్పాను. ఇంతకాలం ఉద్యమం చేస్తున్న అమరావతి రైతులే నిజమైన హీరోలు. అమరావతి రైతులు, మహిళల పోరాటం ఖచ్చితంగా విజయవంతమవుతుంది. 

కెసిఆర్ రాజ్యాంగాన్ని మార్చమంటే జగన్ ఇప్పటికే రాజ్యాంగాన్ని మార్చేశారు. రాష్ట్రంలో భారత రాజ్యాంగం బదులు భారతి రాజ్యాంగం అమలు అవుతుంది. ప్రత్యేక హోదా మటన్ బిర్యానీ అయితే, ప్రత్యేక ప్యాకేజీ బఫే లాంటిది. అమరావతి రింగ్ రోడ్డు కోసం రూ. 20 వేల కోట్లు ఇస్తామని కేంద్రం చెబితే సిఎం వద్దన్నారు.. అని ఆదినారాయణ రెడ్డి తెలిపారు. 

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధాని గా ప్రజా రాజధాని అమరావతిని కొనసాగించాలంటూ 800 రోజులుగా ఉద్యమం చేస్తున్న ప్రజలకు చంద్రబాబు నాయుడు గురువారం అభినందనలు తెలిపారు. మీ ఉద్యమానికి, పోరాటానికి టీడీపీ ఎప్పుడూ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. ప్రత్యేకంగా ఒక ప్రాంతం మీద  కక్షను పెంచుకున్న ముఖ్యమంత్రిని దేశ చరిత్రలో మొదటిసారి చూస్తున్నామని.. తన మూర్ఖపు వైఖరితో రాష్ట్రంలో లక్షల కోట్ల సంపదను సృష్టించే రాజధాని నిర్మాణాన్ని నిలిపివేసిన జగన్ తప్పులను చరిత్ర ఎప్పటికీ క్షమించదన్నారు. 

రాజ‌ధాని ప్రాంతం స్మశానం అన్న వాళ్లే....ఇప్పుడు అమరావతి భూముల‌ను తాకట్టు పెట్టి అప్పులు  తెచ్చుకుంటున్నారు. రాజధాని విషయంలో నిలకడ లేని నిర్ణయాలు, ముందు చూపులేని ఆలోచనలతో వ్యవహరిస్తున్న వైసిపి ప్రభుత్వ వైఖరి రాష్ట్రానికే శాపంలా మారింది. ప్రభుత్వం ఇప్పటికైనా మూడు ముక్కల రాజధాని ప్రతిపాదనలను పూర్తిగా పక్కన పెట్టి అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలి. దేశ చరిత్ర లో నిలిచి పోయేలా జరుగుతున్న అమరావతి పరిరక్షణ ఉద్యమానికి తెలుగుదేశం ఎల్లవేళలా అండగా నిలుస్తుందని అన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios