ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యాలయంలో పనిచేసే కార్యదర్శుల డిజిటల్ సంతకాలను దుర్వినియోగం చేసిన వ్యవహారం దుమారం రేపింది. ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యాలయంలో పనిచేసే కార్యదర్శుల డిజిటల్ సంతకాలను దుర్వినియోగం చేసిన కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సైబర్ క్రైమ్ విభాగం శనివారం ప్రకటించారు. ఈ మేరకు సైబర్ క్రైమ్ సీఐడీ ఎస్పీ హర్షవర్ధన్ మీడియాతో మాట్లాడుతూ.. కొందరు కార్యదర్శుల డిజిటల్ సంతకాలను నిందితులు దుర్వినియోగం చేసి సీఎంపీలు జారీ చేశారని తెలిపారు. ఏపీ సీఎంవోలోని ఉన్నతాధికారులు రేవు ముత్యాల రాజు, ధనుంజయ్ రెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి పేషీల్లో పనిచేస్తున్న కొందరు సిబ్బంది ఈ నేరానికి పాల్పడినట్లు హర్షవర్థన్ తెలిపారు.
సీఎం డిజిటల్ సంతకాల ద్వారా ఒక్కో ఫైల్కు రూ. 30 వేల నుంచి రూ.50 వేల దాకా వసూలు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ విధంగా ఏప్రిల్ నుంచి 3 నెలల్లో 66 సీఎంపీలు జారీ చేసినట్లు హర్షవర్ధన్ చెప్పారు. తద్వారా వీరు రూ.15 లక్షల దాకా వసూలు చేశారని.. కానీ ఏ ఫైలుకు తుది ఆమోదం లభించలేదని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి డీజిటల్ సంతకాలను దుర్వినియోగం చేసినట్లు తొలుత సీఎం పేషీలోని కార్యదర్శి భరత్ గుప్తా గుర్తించారని హర్షవర్థన్ చెప్పారు. ఈ కేసులో విచారణ కొనసాగుతోందని ఆయన వెల్లడించారు.
