భద్రతా బలగాలకు ఎదురుపడ్డ మావోలు...తుపాకుల మోతతో ఏపీ, ఒడిషా సరిహద్దుల్లో ఉద్రిక్తత
ఆంధ్రా, ఒడిషా సరిహద్దులో ఒక్కసారిగా తుపాకుల మోత మొదలయ్యింది. కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడటంతో ఒకరిపై ఒకరు కాల్పులకు దిగారు.
విశాఖపట్నం: ఆంధ్ర ప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల సరిహద్దులో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఏవోబీ లోని మల్కాన్ గిరి జిల్లా బోయపర్ గూడా పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంకారి, బద్రి పహాడ్ అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టిన పోలీస్ బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో లొంగిపోవాల హెచ్చరించినా మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా దళాలు కూడా ఎదురుకాల్పులకు దిగినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.
ఒక్కసారిగా మావోయిస్టులు, భద్రతా దళాలకు మద్య తుపాకుల కాల్పులతో అటవీ ప్రాంతం దద్దరిల్లింది. అయితే భద్రతా బలగాల ఎదురు కాల్పుల నుంచి మావోయిస్టులు సురక్షితంగా తప్పించుకొన్నారు. ఈ కాల్పుల్లో పాల్గొన్న భద్రతా బలగాల్లో కూడా అందరూ సురక్షితంగానే వున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ఎదురు కాల్పులు పూర్తిగా ఆగిపోయిన తర్వాత సంఘటనా స్థలంలో గాలించిన పోలీసులకు పెద్దఎత్తున మావోయిస్టుల సామాగ్రి లభించింది. వాటన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కోసం తిరిగి గాలింపు ప్రారంభించాయి భద్రతా దళాలు.