జగన్ ట్రావెల్స్ వోల్వో బస్సులో అగ్నిప్రమాదం, వృద్ధురాలు సజీవ దహనం..
వెంటనే గమనించిన పెట్రోలింగ్ లో ఉన్న పోలీసులు సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోకి కర్నూలు ఆస్పత్రికి తరలించారు.
![Fire breaks out in Amazon Jagan Travels Volvo bus, one dead in kurnool - bsb Fire breaks out in Amazon Jagan Travels Volvo bus, one dead in kurnool - bsb](https://static-ai.asianetnews.com/images/01hesqz51wvv32v30htp7ckry4/bus-fire-delhi_363x203xt.jpg)
కర్నూలు : ఆంధ్రప్రదేశ్ లోని గద్వాల లోని బీచుపల్లి 10వ బెటాలియన్ దగ్గర ఓ బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. బస్సు పూర్తిగా దగ్ధం అయ్యింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. ప్రమాదం సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులున్నారు. అమెజాన్ జగన్ ట్రావెల్స్ వోల్వో బస్సు బోల్తా పడింది. బోల్తా పడిన వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. హైదరాబాద్ నుంచి చిత్తూరు వెడుతుండగా ఈ ఘటన జరిగింది. వెంటనే గమనించిన పెట్రోలింగ్ లో ఉన్న పోలీసులు సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోకి కర్నూలు ఆస్పత్రికి తరలించారు.
రాత్రి 12 గంటలకు హైదరాబాద్ లోని లక్డీకపూల్ నుంచి బయలుదేరిన బస్సు.. మూడు గంటల సమయానికి గద్వాలలోని బీచ్ పల్లి దగ్గరికి చేరుకుంది. 44వ జాతీయ రహదారి దగ్గర బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో మంటలు చెలరేగాయి. వెంటనే బస్సులోని ప్రయాణికులు బస్సు అద్దాలు పగలగొట్టుకుని బయటపడ్డారు. అయితే, అందులో ఉన్న ఓ వృద్ధురాలు మాత్రం బయటపడలేకపోయింది. దీంతో సజీవ దహనం అయ్యిందని సమాచారం. సజీవదహనం అయిన మహిళ పేరు మాలతిగా గుర్తించారు. మూలమలుపు కనిపించక ఢీ కొట్టడంతో బస్సు బోల్తా పడింది.
ఈ బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతంలో రెండు, మూడేళ్లకు ఒకసారి ఇలాంటి ప్రమాదం జరగుతుందని అంటున్నారు స్థానికులు. గతంలో జరిగిన ప్రమాదంలో 44 మంది మృతి చెందారు.