తూర్పుగోదావరి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 61 గుడిసెలు
తూర్పుగోదావరి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాజమహేంద్రవరం రూరల్ మండలం కొంతమూరు జంగాల కాలనీలో తెల్లవారుజామున ఒక గుడిసెలో మంటలు చెలరేగి.. క్షణాల్లో ఆ ప్రాంతం మొత్తానికి వ్యాపించాయి.
తూర్పుగోదావరి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాజమహేంద్రవరం రూరల్ మండలం కొంతమూరు జంగాల కాలనీలో తెల్లవారుజామున ఒక గుడిసెలో మంటలు చెలరేగి.. క్షణాల్లో ఆ ప్రాంతం మొత్తానికి వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 61 పూరి గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి.
అందరూ గాఢనిద్రలో ఉండగా.. పొగ కమ్మేసి ఉండటంతో పిల్లలను తీసుకుని అందరూ రోడ్ల మీదకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపుచేశారు. అయితే అప్పటికే గుడిసెలన్నీ దగ్ధమయ్యాయి.
షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆస్తి నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. రెండేళ్ల క్రితం ఇదే ప్రాంతంలో సంభవించిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులు... ఇప్పుడు మళ్లీ ఇదే ప్రాంతంలో ప్రమాదం సంభవించడంతో జనం కన్నీరుమున్నీరవుతున్నారు.