కృష్ణా జిల్లా వీరవల్లి పోలీసు స్టేషన్ ఎదుట రైతుల ఆందోళన.. తీవ్ర ఉద్రిక్తత
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని వీరవల్లి పోలీసు స్టేషన్ ఎదుట మల్లవల్లి రైతులు ఆందోళనకు దిగారు. మల్లవల్లి ఇండిస్ట్రియల్ కారిడార్కు తామిచ్చిన భూములకు పరిహారం అందలేదని వీరవల్లి పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించారు.
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని వీరవల్లి పోలీసు స్టేషన్ ఎదుట మల్లవల్లి రైతులు ఆందోళనకు దిగారు. మల్లవల్లి ఇండిస్ట్రియల్ కారిడార్కు తామిచ్చిన భూములకు పరిహారం అందలేదని వీరవల్లి పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించారు. తమను అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మల్లవల్లి రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని నినాదాలు చేశారు. పోలీసు స్టేషన్ మందు బైఠాయించిన రైతులను పోలీసులు అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. రైతులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఈ క్రమంలోనే కొందరు రైతులు పురుగుల మందు తాగేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఒక రైతు పురుగుల మందు తాగి స్పృహ కోల్పోవడంతో అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. దీంతో వీరవల్లి పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మల్లవల్లి ఇండిస్ట్రియల్ కారిడార్కు ఆరేళ్లక్రితం భూములిచ్చినా ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏ అధికారిని అడిగిన సరైన సమాధానం ఇవ్వడం లేదని ఆరోపించారు.