విశాఖపట్టణం జిల్లాలో ఎస్ఐగా నమ్మించి యువతిని దోచేశాడు, అరెస్ట్
పోలీసుగా నమ్మించి యువతిని మోసం చేసిన నకిలీ ఎస్ఐపై విశాఖపట్టణం జిల్లా కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
విశాఖపట్టణం: పోలీసుగా నమ్మించి యువతిని మోసం చేసిన నకిలీ ఎస్ఐపై విశాఖపట్టణం జిల్లా కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
విశాఖపట్టణం జిల్లాలోని గవర కంచరపాలెంలో ఉంటున్న యువతికి శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం కొర్లకోటకు చెందిన పైడి రామచంద్రరావుతో పరిచయం ఏర్పడింది.
ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నానని అందుకే గ్రూప్ 1 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నట్టుగా ఆ యువతిని అతడు నమ్మించాడు. ఈ పరిచయం ప్రేమగా మారింది. దీంతో గత ఏడాది జూన్ 19వ తేదీన విశాఖలోని వన్ టౌన్ వరసిద్ది వినాయక ఆలయంలో కులాంతర వివాహం చేసుకొని రిజిస్టర్ చేయించారు.
ఈ విషయాన్ని తన కుటుంబసభ్యులతో పాటు ఇతరులకు కూడ బయటకు రాకుండా ఆయన జాగ్రత్తలు తీసుకొన్నారు. తన చదువు కోసం అత్తింటి కుటుంబం నుండి నిందితుడు డబ్బులు వసూలు చేశాడు.
బంగారు ఆభరణాలను సైతం తాకట్టు పెట్టి రామచంద్రారావుకు భార్య డబ్బులు ఇచ్చింది.కొంత కాలానికి నిందితుడి అసలు స్వరూపం బయటకు వచ్చింది. భార్య సోదరిని అతను కులం పేరుతో దూషించాడు.
ఈ సమయంలో పెద్ద మనుషుల మధ్య పంచాయితీ కూడ నిర్వహించారు. అయినా కూడ రామచంద్రారావులో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో నిందితుడిపై కంచరపాలెం పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.