టీడీపీ సీనియర్ నేత, కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా వెంకట రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. 

టీడీపీ మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ వైసీపీలో చేరారు. గురువారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. అనంతరం వెంకట రమణ మీడియాతో మాట్లాడుతూ.. తనకు అన్యాయం జరిగిందని వడ్డీ సామాజిక వర్గానికి కోపం వుందన్నారు. తనకు ఎంఎల్‌సీ ఇవ్వలేదని మా సామాజిక వర్గానికి కోపమన్నారు. తమ సామాజిక వర్గానికి టీడీపీపై ప్రేమ వున్నా.. తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదని వైసీపీకి ఓటేస్తారని భావిస్తున్నానని వెంకట రమణ ధీమా వ్యక్తం చేశారు. 

అంతకుముందు జగన్‌తో జయమంగళ వెంకటరమణ భేటీ అయ్యారు. ఆయనను మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయానికి తీసుకొనివచ్చారు. ఆయనకు వైసీసీ ఇప్పటికే ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేసిందనే ప్రచారం కూడా ఉంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 23న స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికకి జయమంగళ నామినేషన్ దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ALso REad: సీఎం జగన్‌తో మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ భేటీ.. ఫిబ్రవరి 23న స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా నామినేషన్..!

ఇకపోతే.. జయమంగళ వెంకరమణ కైకలూరు నియోజకవర్గం నుంచి 2009లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. కైకలూరు టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్న జయమంగళ వెంకటరమణ.. ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన పథకాలు నచ్చి వైసీపీలోకి చేరుతున్నట్లు ప్రకటించారు. గత కొంతకాలంగా టీడీపీ అధిష్టానంపై జయమంగళ వెంకటరమణ అసంతృప్తితో ఉన్నారు. రానున్న ఎన్నికల్లో కైకలూరు నుంచి టికెట్ కేటాయించే విషయంలో అధిష్టానం హామీ ఇవ్వకపోవడంపై వెంకటరమణ అసంతృప్తితో ఉన్నారని ఆయన సన్నిహితులు తెలిపారు. ఒకవేళ ఇతర పార్టీలతో పొత్తులుంటే తన టికెట్ పరిస్థితి ఏమిటనే దానిపై ఆవేదనతో ఉన్న ఆయన పార్టీ మారాలనే నిర్ణయం తీసుకున్నారు.