ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఏపీలో వాలంటీర్ వ్యవస్థ దుర్వినియోగం అవుతోందని పవన్ ఆరోపిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఏపీలో వాలంటీర్ వ్యవస్థ దుర్వినియోగం అవుతోందని పవన్ ఆరోపిస్తున్నారు. వాలంటీర్లు సేకరించిన డేటా ఎక్కడ స్టోర్ చేస్తున్నారు? వాలంటీర్లకు బాస్ ఎవరు? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే జనసేన, వైసీపీ పార్టీల మధ్య మాటల యుద్దం నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ చేస్తున్న వాఖ్యలకు మాజీ ఎంపీ, కాపు నేత చేగొండి హరిరామజోగయ్య మద్దతు పలికారు. అవసరం అనుకుంటే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలన్న పవన్ ఆలోచన మంచిదేనని అన్నారు. ఈ మేరకు ఆయన పవన్ కల్యాణ్‌కు హరిరామ జోగయ్య లేఖ రాశారు. 

అయితే వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయడం కంటే కొన్ని అంశాల్లో సంస్కరణలతో పునర్ నిర్మించుకుంటే బాగుంటుందని హరిరామజోగయ్య అభిప్రాయపడ్డారు. వాలంటీర్ వ్యవస్థలో అత్యధికంగా మహిళలకే అవకాశం కల్పించాలని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో కంటే.. అధికార పార్టీ ప్రయోజనాల కోసమే వాలంటీర్లను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. వాలంటీర్ వ్యవస్థలో ఎక్కువమంది వైసీపీ వాళ్లేనని.. అందుకే ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్ వ్యవస్థ జోక్యం చేసుకోరాదని జీవో ఇవ్వాల్సి వచ్చిందని అన్నారు. 

జనసేన అధికారంలో వస్తే తన ప్రతిపాదనలను పరిశీలించాలని కోరారు. వాలంటీర్ల సమస్యలను పరిష్కరించే దిశగా పవన్ కల్యాణ్ కృషి చేయాలని సూచించారు. వాలంటీర్లకు కనీస విద్యార్హత 10వ తరగతి ఉండేలా చూసి, వారికి కనీస వేతనం రూ.10 వేలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.