పోటీకి సిద్ధమంటున్న మాజీ ఎమ్మెల్యే... వైసీపీలో టెన్షన్
సమరానికి సిద్ధం కావాలని పార్టీ క్యాడర్కు సంకేతాలు ఇచ్చారు. దీంతో డోన్లో మళ్లీ త్రిముఖ పోరు తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండంటే.. నేతలంతా అప్రమత్తమౌతున్నారు. తాజాగా మరో మాజీ ఎమ్మెల్యే రానున్న ఎన్నికల్లో పోటీకి సిద్ధమని ప్రకటించారు. దీంతో వైసీపీ నేతల్లో టెన్షన్ పెరిగిపోయింది.
ఇంతకీ అసలు మ్యాటరేంటంటే...కర్నూలు జిల్లా డోన్ కి చెందిన మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ రీ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.తాను మళ్లీ డోన్ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతానని ఆమె ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆదివారం ప్యాపిలిలో కార్యకర్తల నడుమ ప్రకటన చేశారు. సమరానికి సిద్ధం కావాలని పార్టీ క్యాడర్కు సంకేతాలు ఇచ్చారు. దీంతో డోన్లో మళ్లీ త్రిముఖ పోరు తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మొదటిసారిగా కోట్ల సుజాతమ్మ 2004 అసెంబ్లీ ఎన్నికల్లో డోన్ నియోజకవర్గ రాజకీయాల్లో అడుగు పెట్టారు. అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కేఈ ప్రభాకర్పై గెలుపొందారు. తర్వాత 2009 సాధారణ ఎన్నికల్లో మరోసారి డోన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగానే పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి కేఈ కృష్ణమూర్తి చేతిలో ఓడిపోయారు.
ఆ తరువాత కూడా కాంగ్రెస్ పార్టీ తరపున నియోజకవర్గ బాధ్యతలు చూసుకున్నారు. 2014 సాధారణ ఎన్నికల ముందు రాష్ట్ర విభజన జరగడంతో.. కోట్ల సుజాతమ్మ డోన్ నియోజకవర్గ రాజకీయాలకు దూరమయ్యారు. ఆలూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడంతో.. డోన్ నుంచి లక్కసాగరం లక్ష్మీరెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో నిలిపారు. అప్పటి నుంచి డోన్ బాధ్యతలను లక్ష్మీరెడ్డి చూస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఆమె పోటీ చేస్తానని ప్రకటించడంతో.. డోన్ లో పోటీ ఎక్కువగా ఉంటుందన్న విషయం అర్థమైంది. దీంతో వైసీపీ నేతల్లో ఇప్పటి నుంచే టెన్షన్ మరింత పెరిగిపోతోంది.