పెరుగు, తేనె, చేపలపై జీఎస్టీ విధిస్తుంటే మాట్లాడరా : జగన్ ప్రభుత్వంపై యనమల ఆగ్రహం
జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో ఏపీ ప్రభుత్వ తీరు సరిగా లేదన్నారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. ప్రజలపై భారం మోపుతున్నా జగన్ ప్రభుత్వం ఏ మాత్రం వ్యతిరేకించలేదని మండిపడ్డారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై (ys jagan) మండిపడ్డారు టీడీపీ (tdp) సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు (yanamala ramakrishnudu) . గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రెడ్డి తన అవినీతి కేసుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాడని ఆరోపించారు. జీఎస్టీ కౌన్సిల్ లో (gst council meeting) ప్రజలపై భారాలు మోపుతున్నా వైసీపీ ప్రభుత్వం నోరు మెదపలేదని యనమల ఫైరయ్యారు. జీఎస్టీ నష్టపరిహారం మరో ఐదేళ్ల పాటు పొడింగించాలని చిన్న చిన్న రాష్ట్రాలు సైతం గళం విప్పాయని, కేంద్రాన్ని ప్రశ్నించాయని రామకృష్ణుడు గుర్తుచేశారు. జీఎస్టీతో నష్టపోయిన రాష్ట్రాలకు ఆదాయంలో కొంతభాగం చెల్లించాలని జీఎస్టీ చట్టంలోనే ఉందని ఆయన తెలిపారు
చట్టపరంగా రావాల్సిన హక్కులను సైతం అడగలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉండటం భాధాకరమన్నారు. జగన్ రెడ్డి, ఆర్ధికమంత్రి మాత్రం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టేందుకే నిర్ణయించుకున్నారని యనమల ఆరోపించారు. ప్రజలపై భారాలు పడకుండా చర్యలు తీసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఆయన ఎద్దేవా చేశారు. పెరుగు, తేనె, చేపలు, మాంసం వంటి ఆహార పదార్ధాలపై జీఎస్టీ విధిస్తామన్న నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్దతు పలుకడం దుర్మార్గమన్నారు. జీఎస్టీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్దతు తెలుపుతూ ఇచ్చిన నివేదిక బహిర్గతం చేయాలని యనమల డిమాండ్ చేశారు. రైతులపై భారం పెంచేలా ఎలక్ట్రిక్ పంపులు, మిషన్ల పై ఉన్న పన్నును 12 నుంచి 18 శాతానికి పెంచినా గానీ మాట్లాడలేని స్థితిలో జగన్ ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు.
ఇకపోతే.. 47వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో వెలువడిన పలు నిర్ణయాలు సామాన్యుల జేబుకు చిల్లు పెట్టనున్నాయి. ముందుగా ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై జీఎస్టీ విధించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. ఆహార ధాన్యాలతో సహా పలు వస్తువులు కూడా ప్యాక్ చేసినప్పుడు GSTకి లోబడి ఉంటాయి.
కొత్త రేట్లు జూలై 18 నుంచి అమలులోకి రానున్నాయి
పన్ను శ్లాబ్లలో మినహాయింపులు, సంస్కరణలపై జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలు ఈ ఏడాది జూలై 18 నుంచి అమల్లోకి వస్తాయని రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ విలేకరుల సమావేశంలో తెలిపారు. బజాజ్ ప్రకటనకు ముందు, సీతారామన్ విలేకరులతో మాట్లాడుతూ పన్ను మినహాయింపులు మరియు సంస్కరణలపై GST కౌన్సిల్ సిఫార్సులను GST ఆమోదించింది.