టీడీపీ మాజీ మంత్రి తన బంధువులు, సంస్థలోని ఉద్యోగులు, ఇతర బినామీల పేరుతో వ్యవసాయ భూములను కొనుగోలు చేశారని, ఎల్‌పీఎస్ కింద పేర్కొన్న భూములను సీఆర్‌డీఏకు అప్పగించి, ప్లాట్లు, డబ్బును  తిరిగి వచ్చేలా వార్షిక రూపంలో పొందారని అభియోగాలు మోపారు.

అమరావతి : ఏపీ సిఐడి అమరావతి భూముల మీద దూకుడు పెంచింది. మాజీ మంత్రి పొంగూరు నారాయణ మీద కేసు నమోదు చేసింది. అమరావతి ప్రాంతంలో భూములు కొనుగోలు చేసినట్లు ఈ కేసులో తెలిపింది. ఈ కేసు మీద దర్యాప్తులో భాగంగా.. మాజీ మంత్రి సంస్థల్లోని ఉద్యోగులు, ఆయన బంధువుల ఆస్తులను జప్తు చేసింది. నారాయణ బంధువులు.. సంస్థల్లో పని చేసే ఉద్యోగులు..మాజీ మంత్రికి దగ్గరి మరికొందరు వ్యక్తుల పేరుతో ఉన్న 21 స్థిరాస్తులను ఏపీ సిఐడి అటాచ్ చేసింది. వీటితోపాటు మరికొందరు బ్యాంక్ అకౌంట్ లను కూడా సీజ్ చేసింది.

అమరావతి ప్రాంతంలో భూములు కొనుగోలు విషయంలో దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు.. అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మాజీ మంత్రి పొంగూరు నారాయణ తన బినామీల భూములకు విలువ పెరిగేలా రాజధాని ప్లాన్ ను రూపొందించినట్లుగా ఆరోపించింది. ఈ ఆరోపణల క్రమంలోనే అమరావతిలోని ఉద్దండరాయిని పాలెం, మందడం, రాయపూడి, లింగాయపాలెం, కొండమ్మ రాజుపాలెం గ్రామాల్లోని ఆస్తులను సిఐడి అటాచ్ చేసింది. 

2015 జూన్- ఆగస్టు మధ్య భూ లావాదేవులు జరిగినట్లుగా పేర్కొంది. ఈ సమయంలో రూ.3.66 కోట్లు పెట్టి 58.50 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారని ఆరోపించింది. 75,880 చదరపు అడుగుల భూమిని దీనికి సంబంధించి సిఐడి తన దర్యాప్తులో అటాచ్ చేసింది. నారాయణ సంస్థల ఉద్యోగి వరుణ్ కుమార్, పొట్లూరి ప్రమీల, ఆవుల ముని శంకర్, రావూరి సాంబశివరావులకు చెందిన బ్యాంక్ అకౌంట్లను కూడా సిఐడి సీజ్ చేసింది. దీంతోపాటు రామకృష్ణ హౌసింగ్ సొసైటీ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి అంజనీ కుమార్ కు చెందిన రెండు ఎకరాల భూమిని కూడా సిఐడి దర్యాప్తుకు అటాచ్ చేసింది. వీరంతా కూడా నారాయణ బినామీ లేనని పేర్కొంది.

పొట్లూరి ప్రమీలకు చెందిన రెండు చోట్ల ఉన్న 2040 గజాల ఉద్దండరాయిని పాలెంలోని ఆస్తిని.. 5970 గజాల నాలుగు ఆస్తులు.. రాయపూడిలో రావూరి సాంబశివరావుకు చెందినవిగా గుర్తించి వీటిని కూడా అటాచ్ చేసింది. రాయపూడిలోనే మరో నాలుగు ఆస్తులు ఆవుల ముని శంకర్ పేరుతో ఉన్నాయని.. 11,690 గజాల ఈ ఆస్తులను కూడా అటాచ్ చేసింది. వీటితోపాటు మందడంలోని 39, 640 గజాల ఐదు ఆస్తులను, లింగాయపాలెంలో 12,880 గజాల రెండు ఆస్తులను సిఐడి జప్తు చేసింది.

ఇక వరుణ్ కుమార్ పేరుతో రాయపూడి లో ఉన్న 480 గజాల రెండు స్థలాలను, కొండమ రాజుపాలెంలో 3180 గజాల రెండు ఆస్తులను కూడా సిఐడి అటాచ్ చేసినట్లుగా ఆంధ్రప్రదేశ్ హోంశాఖ వెల్లడించింది. వీటితోపాటు ఈ నలుగురికి సంబంధించిన బ్యాంకు అకౌంట్లను, వాటిలోని నగదును జప్తు చేసింది. 

హైదరాబాద్ చందానగర్ లోని పొట్లూరు ప్రమీలకు చెందిన డెవలప్మెంట్ క్రెడిట్ బ్యాంక్ లో రూ. 40,88,590లను, నెల్లూరు యూనియన్ బ్యాంకు లో ఆవుల మునిశంకర్కు సంబంధించిన రూ. 69,16,502, రావూరు సాంబశివరావుకు చెందిన అకౌంట్లో ఉన్న రూ.69,94,730లను, బెంగుళూరు ఎంజీ రోడ్డులోని హెచ్డిఎఫ్సి బ్యాంకులో వరుణ్ కుమార్ కు చెందిన అకౌంట్ లో ఉన్న రూ.21,11,660లను సిఐడి సీజ్ చేసినట్లుగా చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఈ నాలుగు అకౌంట్లో మొత్తం రూ.1,92,11,482 నగదును సీజ్ చేసినట్లుగా సిఐడి వివరించింది.