కాంగ్రెస్ కి షాక్... నాదెండ్ల బాటలో పసుపులేటి
మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ బాటలోనే పసుపులేటి బాలరాజు కూడా పవన్ చెంత చేరనున్నట్లు తెలుస్తోంది.
మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు.. కాంగ్రెస్ కి షాకిచ్చేందుకు రెడీ అయ్యారు. ఏపీలో త్వరలో జరిగనున్న ఎన్నికల్లో తాను పోటీచేయడానికి సిద్ధంగా ఉన్నానని.. కాకపోతే ఏ పార్టీ నుంచి పోటీచేస్తానో మాత్రం సస్పెన్స్ అంటూ ఆయన మీడియాతో పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పుడు ఆయన చూపు.. జనసేన వైపు ఉన్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ బాటలోనే పసుపులేటి బాలరాజు కూడా పవన్ చెంత చేరనున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆయన ఈ విషయంపై తన మద్దతుదారులతో చర్చించినట్లు సమాచారం. తన కార్యకర్తల అభిప్రాయాన్ని తెలుసుకొని.. ఆ తర్వాత మీడియా ముఖంగా తన అంతిమ నిర్ణయం చెప్పాలని నిశ్చయించుకున్నారు.
‘‘ ప్రస్తుతం పార్టీలో కొనసాగుతున్న ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ యువకులే.. వారికి రాజకీయ భవిష్యత్ అవసరం.. కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే భవిష్యత్ ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీ ఒక్కటే కనపడుతోంది. మీ అందరూ అంగీకరిస్తే.. జనసేన లో చేరదాం’’ అంటూ పసుపులేటి తన కార్యకర్తలతో చెప్పారు. కాగా.. కార్యకర్తల నిర్ణయం మేరకు త్వరలో తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని ఆయన చెబుతున్నారు.