ప్రజలతో ఆటలాడుతున్నారా.. ఏపీలో కరోనా పరీక్షలపై నారా లోకేష్
. ప్రజల ప్రాణాలకు సంబంధించిన కరోనా పరీక్షల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరీక్షలను ఆషామాషీగా చేస్తున్నారా అనే అనుమానం కలుగుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన కరోనా పరీక్షల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు.
‘‘ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చిందని, క్వారంటైన్ కి రమ్మని హడావిడి చేశారు. అదే ఆయనకు హైదరాబాద్ లో రెండు సార్లు పరీక్ష చేస్తే నెగిటివ్ వచ్చింది. ఒక ఎమ్మెల్సీ విషయం లోనే ఇలా ఆటలాడితే.. ప్రజలతో ఇంకెన్ని ఆటలు ఆడుతున్నారు? ప్రజల ప్రాణాలుకు సంబంధించిన కరోనా పరీక్షల్లో ఏమిటీ నిర్లక్ష్యం?’’ అంటూ లోకేష్ ప్రశ్నించారు.
‘‘ పాజిటివ్ అని నిర్థారణ చేసుకోకుండానే దీపక్ రెడ్డిని క్వారంటైన్ లో పెట్టడానికి చేసిన హడావిడి చూస్తే.. ప్రభుత్వం ఇంకేదైనా కుట్ర చేసిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఏది ఏమైనా కరోనా పరీక్షల విశ్వసనీయత తేలాల్సిందే’’ అంటూ లోకేష్ డిమాండ్ చేశారు. ఈ ట్వీట్స్ కి దీపక్ రెడ్డికి సంబంధించిన కరోనా పరీక్ష ఫలితాలను కూడా జత చేశారు.