ఆస్పత్రిలో అచ్చెన్నాయుడు.. పరామర్శకు అనుమతి కోరిన లోకేష్
గుంటూరు జీజీహెచ్ లో ఉన్న ఆయనను పరామర్శించేందుకు మాజీ మంత్రి, టీడీపీ యువనేత నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఆయన శనివారం అచ్చెన్నాయుడిని కలిసేందుకు పోలీసులను అనుమతి కోరారు.
ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టయిన టీడీపీ నేత, మాజీ మంత్రి కె. అచ్చెన్నాయుడిని గుంటూరు ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. విజయవాడ సబ్ జైలు నుంచి ఆయనను గుంటూరు ప్రత్యేక ఆస్పత్రికి తరలించారు. జైలు అధికారుల అనుమతితో ఆయనను ఆస్పత్రికి తరలించారు.
కోర్టు ఆదేశాలతో ఆయనను ఆస్పత్రికి తరలించారు.
కాగా.. గుంటూరు జీజీహెచ్ లో ఉన్న ఆయనను పరామర్శించేందుకు మాజీ మంత్రి, టీడీపీ యువనేత నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఆయన శనివారం అచ్చెన్నాయుడిని కలిసేందుకు పోలీసులను అనుమతి కోరారు. ఇప్పటి వరకు అయితే.. ఎలాంటి అనుమతి లభించలేదు.
ఇదిలా ఉండగా ఇటీవలే అచ్చెన్నాయుడికి ఆపరేషన్ జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనను ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. కాగా.. ఈఎస్ఐ స్కామ్ కేసులో అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
అచ్చెన్నాయుడిని శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో అరెస్టు చేసి విజయవాడకు తరలించారు.
ఆయనను ఏసీబీ అధికారులు ప్రత్యేక కోర్టు ముందు శుక్రవారంనాడు ప్రవేశపెట్టారు. ఆయనకు ఏసీబీ ప్రత్యేక కోర్టు 14 రోజులు రిమాండ్ విధించారు. అనారోగ్యం కారణంగా ఆయనను ఆస్పత్రికి తరలించాలని కోర్టు ఆదేశించారు.
దాంతో ఆయనను తొలుత విజయవాడ సబ్ జైలుకు తరలించి, ఆ తర్వాత గుంటూరు ఆస్పత్రికి తరలించారు.
ప్రధాన నిందితుడైన ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ రమేష్ కుమార్ ను కూడా అధికారులు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. ఆయనకు కూడా రెండు వారాల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించారు.