2024 ఎన్నికల్లోనూ వార్ వన్ సైడేనన్నారు వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే తాము నూటికి నూరు శాతం గెలుస్తామని బాలినేని జోస్యం చెప్పారు.
2024 ఎన్నికల్లోనూ వార్ వన్ సైడేనన్నారు వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ఆదివారం మంత్రి పెద్దిరెడ్డితో కలిసి బాలినేని మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ 18 మంది ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటిస్తే 11 మంది బీసీలే వున్నారని బాలినేని పేర్కొన్నారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని బాలినేని శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వని స్థాయిలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రశంసించారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకత వుందని అంటున్నారని.. కానీ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే తాము నూటికి నూరు శాతం గెలవబోతున్నామని బాలినేని ధీమా వ్యక్తం చేశారు.
తర్వాత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధిస్తామన్నారు. అభివృద్ధి సంక్షేమానికి జగన్ పెద్ద పీట వేస్తున్నారని.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98.4 శాతం అమలు చేశారని ప్రశంసించారు. కోవిడ్ సమయంలోనూ సంక్షేమానికి పెద్దపీట వేశారని రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. రూపాయి ఆదాయం లేనప్పటికీ.. హామీలు అమలు చేస్తూనే, అభివృద్ధి కార్యక్రమాలను కూడా సీఎం అమలు చేస్తున్నారని మంత్రి ప్రశంసించారు. రాయలసీమలోని నాలుగు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ వైసీపీయే గెలుస్తుందని పెద్దిరెడ్డి జోస్యం చెప్పారు.
