టీడీజీ జాతీయ ప్రధాన  కార్యదర్శి నారా లోకేష్‌కు మాజీ మంత్రి, వైసీపీఎమ్మెల్యే అనిల్  కుమార్ యాదవ్ సవాలు విసిరారు.

టీడీజీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు మాజీ మంత్రి, వైసీపీఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సవాలు విసిరారు. అధికారంలో ఉండి తాను వెయ్యి కోట్ల రూపాయలు సంపాదించానని నారా లోకేష్ ఆరోపణలు చేస్తున్నారని.. అయితే రాజకీయాల్లో వచ్చాక తాను ఆస్తులు పోగొట్టుకున్నానని అన్నారు. దీనిపై తిరుమల కొండపై ప్రమాణానికి సిద్దమని చెప్పారు. రాజకీయాల్లోకి రాకముందు తన తండ్రి ఇచ్చిన ఆస్తి కన్నా.. ఒక్క రూపాయి ఎక్కువగా ఉందని నిరూపించే దమ్ము నారా లోకేష్‌కు ఉందా? అని సవాలు విసిరారు. 

లోకేష్‌కు దమ్ముంటే తన సవాలును స్వీకరించాలని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఆరోపణలు చేసే ముందు సిగ్గుండాలని విమర్శించారు. నారా లోకేష్‌కు దమ్ముంటే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో తనపై పోటీ చేయాలని సవాలు విసిరారు. ఒకవేళ తాను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. సభలో స్టేజీ మీద నుంచి చర్చకు పిలవడం కాదని.. ఇప్పుడు చర్చకు రావాలని.. మధ్యాహ్నం 2 గంటల వరకు సమయం ఇస్తానని చెప్పారు. చెప్పిన అరగంటలో తాను చర్చకు వస్తానని అన్నారు. చర్చకు సింగిల్‌‌గానే వస్తానని తెలిపారు. కావాలంటే లోకేష్ వెయ్యి మందితో రావచ్చని అన్నారు. 

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పిన అజీజ్‌ను ఎందుకు పక్కకు పెట్టారని ప్రశ్నించారు. బెట్టింగ్ కేసులు ఉన్నవాళ్లందరూ లోకేష్‌తోనే ఉన్నారని విమర్శించారు. గంజాయి తరలించే ముఠాకి టీడీపీ నేతలు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారని ఆరోపణలు చేశారు. కరోనా సమయంలో ప్రజల ప్రాణాలు పోతుంటే నారాయణ హైదరాబాద్ వెల్లి దాక్కున్నారని విమర్శించారు. నేడు నెల్లూరుకు రావడానికి ఆయన సిగ్గుండాలని.. అలాంటి విలువలు లేని వ్యక్తులు రాజకీయాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.