మద్యం మత్తులో ఓ వ్యక్తి కానిస్టేబుళ్లపై సుత్తితో దాడిచేయడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఓ కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉంది. 

విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి మద్యం తాగి అర్ధరాత్రి హల్ చల్ చేశాడు. విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లను సుత్తితో కొట్టి గాయపరిచాడు. ఈ దాడిలో ఇద్దరు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఓ కానిస్టేబుల్ ప్రమాద స్థితిలో ఉన్నట్లు సమాచారం. పోలీసులు వీరిద్దరినీ మెరుగైన చికిత్స కొరకు సెవెన్ హిల్స్ ఆసుపత్రికి తరలించారు.

ఇలాంటి ఘటనలు గతంలోనూ పలు చోట్ల వెలుగు చూశాయి. నిరుడు జూన్ లో ఓ తాగుబోతు హైదరాబాద్ లోని ఉస్మానియా ఆస్పత్రిలో హల్ చల్ చేశాడు. మద్యం మత్తులో రాహుల్ అనే యువకుడు జియాగూడలో రోడ్ల మీద వెళ్లే బండ్లను అడ్డుకుంటూ హంగామా చేశాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో తాగుబోతు పోలీసులను దుర్భాషలాడుతూ హంగామా సృష్టించాడు. 

అదుపుచేసేందుకు ప్రయత్నించిన పోలీసుల మీద దాడికి యత్నించాడు. ఈ ఘటనతో ఆస్పత్రిలోని రోగులతో పాటు వైద్య సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు తాగుబోతుకు వైద్య సిబ్బంది ఇంజక్షన్ ఇవ్వడంతో మత్తు దిగాక అతన్ని కుల్సుంపుర పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

విశాఖలో ప్రారంభమైన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్: ముఖేష్ అంబానీ సహా పలువురు హజరు

ఇదిలా ఉండగా, మే 27న ఉత్తరప్రదేశ్ లో ఓ మర్డర్ కేసు మిస్టరీని మద్యం మత్తులో ఉన్న వ్యక్తి ఛేదించాడు. ఉత్తరప్రదేశ్లోని భంగేల్ నివాసి అభయ్ త్యాగి.. హంతకులను పట్టుకోవడంలో పోలీసులకు ఓ మందుబాబు ఇచ్చిన సమాచారం చాలా ఉపయోగపడింది. దాడి జరిగినపుడు హంతకులు వచ్చిన బైక్ రంగును, రిజిస్టేషన్ నంబరుతో కొంత భాగాన్ని మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి పాక్షికంగా గుర్తుంచుకుని, పోలీసులకు చెప్పడంతో హంతకులను పట్టుకోగలిగారు. సెంట్రల్ నోయిడా అడిషనల్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఎలమారన్ జీ తెలిపిన వివరాల ప్రకారం, ఫేజ్-1 పోలీస్ స్టేషన్ పరిధిలోని భంగేల్ నివాసి అభయ్ త్యాగి, మరో ఇద్దరు వ్యక్తులు కలిసి రాత్రి వేళలో ఇంటికి తిరిగి వెళ్తున్నారు. వీరంతా మద్యం సేవించి ఉన్నారు. 

ఆ సయమంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు రెండు బైక్ లపై అక్కడికి వచ్చారు. వీరి మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం దాడి చేసుకోవడంతో త్యాగి మరణించారు. ఆ ముగ్గురు బైక్ లపై పారిపోయారు. ఈ సంఘటన మే 14న రాత్రి జరిగింది. నిందితులను గుర్తించేందుకు పోలీసులకు ఆధారాలు దొరకడం లేదు. అయితే, మృతుని స్నేహితుల్లో ఒకరు ఈ సంఘటన జరిగినప్పుడు మద్యం మత్తులో ఉన్నప్పటికీ నిందితులు వచ్చిన ఓ బైక్ నెంబర్ ను పాక్షికంగా గుర్తుంచుకున్నారు. అదేవిధంగా దాని రంగును కూడా గుర్తుంచుకున్నారు. UP 16 CH వరకు మాత్రమే ఉందని, ఆ బైక్ రంగు నల్లగా ఉందని చెప్పారు. 

మరొక ఆధారం ఏదీ లభించకపోవడంతో.. UP 16 CH, నల్లరంగు ఆధారంగా దర్యాప్తును ప్రారంభించారు. గౌతమ్ బుద్ధ నగర్ లో రిజిస్ట్రేషన్ చేయిస్తే యూసీ 16 సిరీస్ నెంబర్ వస్తుంది. భంగేల్, దాని పరిసరాల్లోని గ్రామస్తులు రిజిస్ట్రేషన్ చేయించిన బైక్ ల వివరాలను సేకరించారు. నల్లని రంగులో ఉన్న 100 మోటార్ బైక్ ల వివరాలను సేకరించారు. అన్ని మోటార్ సైకిళ్లను క్షుణ్ణంగా పరిశీలించి, కొందరు యజమానులను ప్రశ్నించారు. చిట్టచివరికి మోహిత్ సింగ్ చౌహాన్ (22), వివేక్ సింగ్ (21)లను ప్రశ్నించారు. వీరిద్దరూ భంగేల్ గ్రామస్తులే. వీరి సెల్ ఫోన్ కాల్ డేటాను తనిఖీ చేశారు. తాము మే 14 రాత్రి త్యాగిని హత్య చేశామని వారు అంగీకరించారు. అనంతరం హత్యానేరం క్రింద ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు. మూడో నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ప్రారంభించారు.