వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మమ్మ హెల్త్ బులిటెన్ విడుదల.. వైద్యులు ఏం చెప్పారంటే..?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మమ్మ హెల్త్ బులిటెన్ను కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి వైద్యులు విడుదల చేశారు.
కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మమ్మ హెల్త్ బులిటెన్ను కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి వైద్యులు విడుదల చేశారు. ఈ నెల 19న గుండెపోటుతో అనారోగ్యానికి గురైన లక్ష్మమ్మకు తొలుత పులివెందులలో చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రికి తరలించారు. గత నాలుగు రోజులుగా లక్ష్మమ్మకు అక్కడి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే లక్ష్మమ్మ ఆరోగ్య పరిస్థితిపై ఈరోజు ఉదయం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
లక్ష్మమ్మ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని విశ్వభారతి ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు. లక్ష్మమ్మ కార్డియో సమస్యతో బాధపడుతున్నారని తెలిపారు. ఆమె ప్రస్తుతం వైద్యుల బృందం పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు. ఆమెకు వాంతులు కావడంతో అల్ట్రా స్కాన్ చేయాలని పేర్కొన్నారు. లక్ష్మమ్మ బీజేపీ కంట్రోల్లోకి రాలేదని.. మరికొన్ని రోజులు ఐసీయూలో ఉంచి చికిత్స అందించాలని తెలిపారు.
ఇదిలా ఉంటే.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు ఇప్పటికే పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే. అయితే మే 16, మే 19వ తేదీల్లో రెండు విచారణ తేదీలను అవినాష్ రెడ్డి దాటవేశారు.తాజా ఈరోజు(మే 22) విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. మరోసారి విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని సీబీఐ అధికారులకు లేఖ రాశారు. ప్రస్తుతం తన తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నందున్న విచారణకు హాజరయ్యేందుకు 5 రోజుల సమయం కావాలని కోరారు. ఇక, ఈ నెల 19 నుంచి అవినాష్ రెడ్డి తన తల్లి లక్ష్మమ్మ చికిత్స పొందుతున్న విశ్వభారతి ఆస్పత్రిలో ఉండిపోయారు.
అయితే ఈరోజు ఉదయం సీబీఐ అధికారులే నేరుగా కర్నూలుకు చేరుకోవడంతో ఏ విధమైన పరిణామాలు చోటుచేసుకుంటాయనే ఉద్రిక్తత నెలకొంది. కర్నూలు చేరుకున్న సీబీఐ అధికారులు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్తో చర్చలు జరుపుతున్నారు. శాంతి భద్రతలకు సంబంధించి సీబీఐ అధికారులు ఎస్పీతో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకునే అధికారం ఉందని సీబీఐ అధికారులు చెప్పినట్టుగా సమాచారం.